ప్రియుడి కోసం భర్తను చంపి, ఎన్నారై మహిళ నాటకం: 20ఏళ్ల జైలుశిక్ష విధించిన ఆస్ట్రేలియా కోర్టు
మెల్బోర్న్: ప్రియుడితో కలిసి భర్తకు పానీయాంలో విషం(సెనైడ్) కలిపి, అతడి మరణానికి కారణమైన నిందితురాలికి ఆస్ట్రేలియా కోర్టు గురువారం శిక్షను ఖరారు చేసింది. ఈ హత్యను తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం.. ఇద్దరు నిందితులకు 20ఏళ్లకుపైగా జైలు శిక్షను విధించింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన సామ్ అబ్రహం 2012లో ఉద్యోగ నిమిత్తం భార్య సోఫియా, కుమారుడితోపాటు ఆస్ట్రేలియాకు వచ్చి స్థిరపడ్డారు.
హతమార్చి కన్నీరుకార్చింది.. కానీ..
కాగా, 2015, అక్టోబర్ 13న సామ్ ఆకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ విషయాన్ని కేరళలో ఉన్న కుటుంబానికి తెలిపి సోఫియా కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే, ఆమె ఘాతుకం పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది. మొదట గుండెపోటుతో సామ్ మరణించాడని అంతా భావించారు. కానీ, పోస్ట్మార్టమ్ రిపోర్ట్లో విషప్రయోగం వల్లే అతడు మరణించాడని తేలింది. దీంతో స్థానిక పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు.
ప్రియుడితో కలిసి దారుణం
సోఫియా ప్రవర్తనపై అనుమానంతో ఆమె కదలికలపై దృష్టి సారించారు. కొన్ని రోజుల తర్వాత సోఫియా, కేరళకు చెందిన అరుణ్ కమలాసనన్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని వారు గమనించారు. ప్రాథమిక విచారణ అనంతరం సోఫియా, అరుణ్లో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది.
పెళ్లిళ్లైనా పాత పరిచయం మరవలేక..
కాగా, కేరళకు చెందిన అరుణ్ కమలాసనన్, సోఫియా.. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమకు దారితీసింది. కానీ, ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో సోఫియా.. సామ్ అబ్రహంను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అరుణ్కు కూడా వేరొక అమ్మాయితో పెళ్లైంది. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, పెళ్లైన తర్వాత కూడా సోఫియా, అరుణ్లు తమ గతాన్ని మర్చిపోలేకపోయారు.
భార్యను వదిలేసి వచ్చిన ప్రియుడు
సోఫియా భర్తతో కలిసి మొదట దుబాయ్లో ఉండేది. ఆ తర్వాత 2012లో వాళ్లు ఆస్ట్రేలియాకు వచ్చి స్థిరపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అరుణ్.. భార్యా పిల్లల్ని వదిలి పెట్టి 2013లో ఆస్ట్రేలియా చేరుకున్నాడు. అప్పటి నుంచి సోఫియా, అరుణ్లు రహస్యంగా తరచూ కలుసుకునేవారు. వారు చర్చించుకున్న విషయాల గురించి సోఫియా తన డైరీలో రాసుకునేది. ఈ విషయాలేవీ భర్తకు తెలియకుండా జాగ్రత్తపడేది. ఈ క్రమంలో సామ్ అడ్డు తొలగించుకుంటే.. తామిద్దరం కలిసి ఉండొచ్చని భావించిన అరుణ్.. ఇందుకు సోఫియాను ఒప్పించి సామ్ను హత్య చేసేందుకు కుట్రపన్నాడు. ఈ క్రమంలో 2015 అక్టోబర్లో సామ్కు సైనేడ్ కలిపిన ఆరెంజ్ జ్యూస్ ఇచ్చి అతడిని హత్య చేశారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా సోఫియా కపట కన్నీరుకార్చింది. కానీ, నిజం పోలీసుల దర్యాప్తులో బయపటడింది.
నిందితులకు ఇదే సరైన శిక్ష
సోఫియాను నిందితురాలిగా నిరూపించడానికి ఆమె సీక్రెట్ డైరీ ఉపయోగపడిందని ప్రాసిక్యూషన్ లాయర్ తెలిపారు. ఈ హత్యను తీవ్రంగా పరిగణించిన కోర్టు నిందితులిద్దరికీ కఠిన శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ‘సామ్ అబ్రహం కుటుంబంతో సహా తన ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో హత్యకు గురయ్యాడు. అతడిని చంపడానికి నిందితులు విషాన్ని ఉపయోగించారనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ హత్యలో ప్రధాన సూత్రధారి అయిన అరుణ్ కమలాసనన్కు 27 ఏళ్లు, అతడికి సహకరించిన సోఫియాకు 22 ఏళ్ల పాటు కఠిన శిక్ష విధిస్తున్నాం' జస్టిస్ కోగ్లాన్ తీర్పు చెప్పారు. నిందితులకు ఇదే సరైన శిక్ష అంటూ వ్యాఖ్యానించారు.