అంటార్కిటికా మంచుదిబ్బల కింద మరో ప్రపంచం.. రహస్య జీవులు?
అగ్ని పర్వతాలకు పెట్టింది పేరైన అంటార్కిటికా మంచు దిబ్బల కింద మరో ప్రపంచం ఉందా? అక్కడ రహస్య జీవులు నివాసం ఏర్పరచుకున్నాయా? ఇప్పుడు శాస్త్రవేత్తల మెదళ్లను తొలిచేస్తోన్న ప్రశ్న ఇది.
మెల్ బోర్న్: అగ్ని పర్వతాలకు పెట్టింది పేరైన అంటార్కిటికా మంచు దిబ్బల కింద మరో ప్రపంచం ఉందా? అక్కడ రహస్య జీవులు నివాసం ఏర్పరచుకున్నాయా? ఇప్పుడు శాస్త్రవేత్తల మెదళ్లను తొలిచేస్తోన్న ప్రశ్న ఇది.
చాలా ఏళ్ల క్రితం ఈ అగ్ని పర్వతాలు జ్వలించి విస్ఫోటనం చెందడం వల్ల కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద గుహలు ఏర్పడ్డాయి. ఆ తరువాత వాటిపై మంచు దిబ్బలు పేరుకుపోయాయి. అయితే ఈ మంచు దిబ్బల కింద ఉన్న గుహల్లో వెచ్చటి వాతావరణ ఉండడం విచిత్రమే.
ఆ గుహల్లో జీవుల అభివృద్ధికి, సంతానోత్పత్తికి అవసరమైన 25 డిగ్రీల ఉష్టోగ్రత కూడా ఉన్నట్లు ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆస్ట్రేలియన్ నేషనల్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు అంటార్కిటికా పర్యటనకు వెళ్లారు. అక్కడి రోస్ ద్వీపం వద్ద ఎరెబస్ పర్వతం పరిసరాల్లో వారికి ఈ గుహలు తారసపడ్డాయి.
ఇన్నాళ్లూ ఈ గుహలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆసక్తిగా కనిపించడంతో శాస్త్రవేత్తలు అక్కడి మట్టి నమూనాలను తీసుకెళ్లి పరీక్షించారు. గుహల్లో లభించిన డీఎన్ఏ... బాహ్య ప్రపంచంలోని మొక్కలు, జంతువుల జన్యువులతో పోలి ఉన్నట్లు తేలింది!
ఈ ఆధారాన్ని బట్టి అక్కడ రహస్య జీవుల జాడ శాస్త్రవేత్తలకు స్పష్టంగా తెలిసింది. అయితే అవి ఇంకా ఆ గుహల్లో బతికే ఉన్నాయా? ఒకవేళ బతికి ఉంటే ఆ జీవులు ఎలా ఉంటాయి? అక్కడి మొక్కల ప్రత్యేకతేంటి? ఇవి ఎలా జీవిస్తున్నాయన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తిగా మారింది.
''మంచు కప్పిన ఆ గుహల ద్వారాలు కాంతివంతంగా ఉన్నాయి. లోపలికి వెళ్లి చూస్తే ఆ గుహల్లో 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అసలు ఈ గుహ వ్యవస్థ అక్కడ ఎలా ఏర్పడిందో, వాటిలోపల ఇంకెన్ని అద్భుతాలు ఉన్నాయో త్వరలోనే తెలుసుకుంటాం..'' అని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఫ్రాసెర్ వ్యాఖ్యానించారు.