రాయడానికేమీ లేదు: ఫ్రంట్ పేజీలను నల్లరంగుతో నింపేసిన ప్రింట్ మీడియా: ప్రభుత్వ వైఖరికి నిరసనగా!
సిడ్నీ: నిద్ర లేచిన వెంటనే న్యూస్ పేపర్లను చదవి అలవాటు చాలామందికి ఉంటుంది. వేడి వేడిగా కాఫీని సిప్ చేస్తూ, వాడి వేడిగా వార్తలను ఏమున్నాయో దినపత్రిలకను తిరగేస్తుంటారు. ఫ్రంట్ పేజీలో పబ్లిష్ అయ్యే వార్తలకు ఉండే ప్రయారిటీనే వేరు. అలాంటి పేజ్ వన్ లో ఎలాంటి వార్తలు లేకుండా.. నల్లరంగులో నింపేశాయి దాదాపు అన్ని ఆస్ట్రేలియన్ మీడియా సంస్థలు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇలా వినూత్నంగా నిరసన చేపట్టాయి. కొద్దిరోజులుగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వం రహస్య విధానాలను పాటిస్తోందట. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదనేది ఆరోపణ.
డీకే శివకుమార్ ఇంటిపై సీబీఐ అధికారుల మెరుపు దాడి: ఇప్పటికే తీహార్ జైలులో.. మరిన్ని కేసులు?
రహస్య పరిపాలనకు వ్యతిరేకంగా..
ఈ వైఖరిని పట్ల మీడియా సంస్థల అధినేతలు, ఎడిటర్లు.. ఫస్ట్ పేజీలను నల్లరంగుతో నింపేసి నిరసన వ్యక్తం చేశారు. పరిపాలన మొత్తం గుట్టు చప్పుడు కాకుండా సాగుతోందని వారు ఆరోపిస్తున్నారు. మీడియాను అణచివేసే ధోరణికి పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన దాదాపు అన్ని మీడియా సంస్థల నుంచి వెలువడిన దినపత్రికలన్నీ నల్లరంగును పులముకుని కనిపించాయి. ది ఆస్ట్రేలియన్, ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ఫైనాన్షియల్ రివ్యూ, డెయిలీ టెలిగ్రాఫ్ వంటి టాప్ సేల్స్ ఉన్న దిన పత్రికల ఫస్ట్ పేజీలు నల్లరంగులో వెలువడ్డాయి.
టాప్ మీడియా సంస్థలు సైతం..
మీడియా మొనార్క్ గా భావించే రూపర్ట్ ముర్డోక్ కు చెందిన న్యూస్ కార్పొరేషన్, నైన్ ఎంటర్ టైన్ మెంట్స్ యాజమాన్యానికి చెందిన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ది ఏజ్, హెరాల్డ్ సన్ సహా దాదాపు అన్ని దినపత్రికల ఫ్రంట్ పేజీలు ఇదే తరహాలో దర్శనం ఇచ్చాయి. ది ఆస్ట్రేలియన్ దినపత్రిక వెలువడేది న్యూస్ కార్పొరేషన్ సంస్థ నుంచే. ముద్రించిన అక్షరాలను నల్లరంగుతో కొట్టేసినట్లుగా ఆయా పత్రికలన్నీ కూడబలుక్కున్నట్లు ఒకే రోజు మార్కెట్ లోకి వచ్చాయి. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో పాఠకులు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందోనంటూ మీడియా కార్యాలయాలకు ఫోన్లు చేస్తున్నారట.
వ్యతిరేక వార్తలపై సర్కార్ మార్క్ ఆగ్రహం..
ఓ సామాజిక సంస్థ ఇచ్చిన కీలక సమాచారం మేరకు ది ఆస్ట్రేలియన్ సహా కొన్ని దినపత్రికలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. దీనిపై ప్రభుత్వం వివరణ కోరింది. దీనికి అనుగుణంగా వివరణలు ఇచ్చుకున్నాయి కూడా. అయినప్పటికీ- ప్రభుత్వం మెత్తబడలేదు. మెట్టు దిగలేదు. రూపర్ట్ ముర్డోక్ కు చెందిన న్యూస్ కార్పొరేషన్, సిడ్నీ కేంద్రంగా ప్రసారమయ్యే ఆస్ట్రేలియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కార్యాలయాలపై కొద్దిరోజుల కిందట ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడులు, తనిఖీలు, సోదాలు మీడియా సంస్థలకు ఆగ్రహాన్ని తెప్పించాయని చెబుతున్నారు.
మహిళా సంపాదకురాలిని నిలువెల్లా తనిఖీలు..
ఆస్ట్రేలియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ మహిళా సంపాదకురాలిని పోలీసులు తనిఖీ చేసిన విధానం అత్యంత అమానవీయమని విమర్శలు వెలువడ్డాయి. ఎలాంటి ఆధారాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలను ప్రచురించారని ప్రశ్నిస్తూ పోలీసులు ఆమెను నిలువెల్లా తనిఖీ చేశారని అంటున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా చెప్పుకొనే మీడియాపై ఆంక్షలు విధించడం, తాము చెప్పినట్టు వినాలనే ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము ఈ చర్యలు తీసుకున్నట్లు మీడియా, ఎంటర్ టైన్ మెంట్, ఆర్ట్స్ అలయన్స్ (ఎంఈఏఏ) ప్రధాన కార్యదర్శి పాల్ మర్ఫీ అన్నారు.
కుదిపేస్తోన్న మీడియా బ్లాక్ అవుట్..
ప్రభుత్వం ఆంక్షలు సడలించేంత వరకూ తమ నిరసన కొనసాగిస్తామని, నిరసన స్వరూపం ఎలా ఉండాలనేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. కనీస సమాచారాన్ని కూడా వెల్లడించకుండా ప్రభుత్వం దేశ ప్రజలను చీకట్లో ఉంచడానికి, కళ్లు గప్ప డానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ఘటన ఆస్ట్రేలియన్ చట్టసభలను కుదిపేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు పత్రిక ప్రతులను ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిప్పులు చెరుగుతున్నారు. దీనిపై ఆస్ట్రేలియా సమాచార శాఖ మంత్రి పాల్ ఫ్లెచర్ ఇప్పటిదాకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నాన్ని తాము ఎప్పుడు చేయలేదని అన్నారు.