తల్లిదండ్రులా? రాక్షసులా?: కన్నకూతురిపై 15ఏళ్లుగా లైంగిక చిత్రవధ
సిడ్నీ : కడుపు తీపి లేని తల్లులు.. కన్నబిడ్డల్ని సైతం చిత్రవధలకు గురిచేస్తోన్న తండ్రులు.. నేటి సమాజ దుస్థితి ఇది. బాగోగులు చూడడం సంగతి అటుంచి.. కనీసం మనుషుల్లా కూడా వ్యవహరించలేని తల్లితండ్రుల జాబితా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఎక్కడో ఓ చోట.. తల్లిదండ్రుల చేతుల్లోనే చిధ్రమైపోతున్న చిన్నారుల గాథలు.. ప్రతీరోజు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
తాజాగా ఆస్ట్రేలియాలో వెలుగుచూసిన ఓ తల్లిదండ్రుల దుర్మార్గపు బాగోతం.. యావత్తు ప్రపంచాన్నే కలవరపెట్టేదిగా ఉంది. కన్న కూతురినే రాచి రంపాన పెట్టి.. చెప్పుకోలేని రీతిలో ఆమెను నానా చిత్రవధకు గురిచేశారు. ఆ చిన్నారికి ఐదేళ్ల ప్రాయం రాగానే మొదలైన ఈ చిత్రహింసల పర్వం.. ఆమెకు 24 ఏళ్లు వచ్చేదాకా కొనసాగుతూనే వచ్చింది. ఎట్టకేలకు సదరు దుర్మార్గపు తల్లిదండ్రుల వ్యవహారం బయటి ప్రపంచానికి తెలియడంతో.. ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెట్టుకోవడానికి సిద్దమయ్యారు.
ఆస్ట్రేలియాకు చెందిన 59ఏళ్ల ఓ వ్యక్తి అతని 51ఏళ్ల భార్య కలిసి 15ఏళ్లుగా కన్నబిడ్డను చిత్రహింసలు పెడుతున్నారు. ఐదేళ్లు వచ్చాక.. ఇంటిముందున్న ఓ షెడ్డులో చిన్నారిని పశువును కట్టేసినట్టు కట్టేసిన ఆ తల్లిదండ్రులు.. ఆమె శరీరమంతా రంపపు బ్లేడ్లతో గాయపరిచారు. సదరు నీచపు తండ్రి ఆమెతో లైంగిక వాంఛలను తీర్చుకోగా.. అందుకు ఆ నీచపు తల్లి దగ్గరుండి మరీ సహకరించింది.
తల్లిదండ్రులు పెడుతోన్న శారీరక హింసను తాళలేక.. ఇంట్లోంచి పారిపోయి 2011లో పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత యువతి. దీంతో 2013లో విచారణ అనంతరం వారిద్దరిని అరెస్టు చేయగా.. శుక్రవారం నాడు కోర్టు తుది తీర్పు వెలువరించింది. తండ్రిపై మొత్తం 73 నేర అభియోగాలకు గాను 48ఏళ్ల జైలు శిక్ష.. తల్లిపై 13 నేర అభియోగాలకు గాను 16ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిని ఆ నీచపు తల్లిదండ్రుల తీరును చూసి.. సిడ్నీ కోర్టు సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.