50 ఏళ్ల తర్వాత గమ్యానికి చేరిన ఉత్తరం, పోస్టాపీస్ క్షమాపణ
మెల్బోర్న్: యాభై ఏళ్ల తర్వాత ఉత్తరం అందించినందుకు ఆస్ట్రేలియన్ పోస్టాఫీస్ క్షమాపణలు కోరింది. ఈ షాకింగ్ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో నివాసం ఉంటున్న టిమ్ డఫ్పీ కుటుంబానికి ఇటీవల ఓ ఉత్తరం వచ్చింది.
దానిని చూసి వారు ఆశ్చర్యపోయారు. యాభై ఏళ్ల క్రితం అంటే 1966లో రాసిన ఆ ఉత్తరం ఇప్పుడు చేరింది. ఆ ఉత్తరాన్ని అందించడం కోసం పోస్టాఫీస్ వాళ్లు ఏకంగా అర్ధ సెంచరీ తీసుకున్నారు. అడిలైడ్ వాసి రాబర్ట్ జార్జియోకు ఫ్రాన్స్ ఆధీనంలోని టాహిటి ద్వీపం నుంచి క్రిస్ అనే వ్యక్తి ఈ ఉత్తరాన్ని రాశారు.
1963లో నిర్మించిన తమ ఇంటికి రాబర్ట్ మొదటి యజమాని అయి ఉండవచ్చునని, తాము 2015లో ఇటలీకి చెందిన వ్యక్తి నుంచి దానిని కొనుగోలు చేశామని టిమ్ కుటుంబం తెలిపింది. అయితే ఉత్తరాన్ని చేరవేయడంలో జరిగిన ఆలస్యానికి ఆస్ట్రేలియా తపాలా విభాగం క్షమాపణలు చెప్పడం గమనార్హం.