దారుణం : తల్లిని నరికి ఫుట్పాత్పై తల పడేసిన కసాయి కూతురు
సిడ్నీ : ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. ఓ యువతి తల్లిని నరికి చంపింది. అయితే ఆమె ఆ దారుణానికి ఎందుకు పాల్పడిందనే విషయం మాత్రం తెలియలేదు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి దృశ్యం చూసి భయభ్రాంతులకు గురయ్యారు.
సిడ్నీలో 57ఏళ్ల మహిళ తన 25ఏళ్ల కూతురుతో కలిసి నివసిస్తోంది. అయితే శనివారం కూతురు ఒక్కసారిగా తల్లిపై దాడికి దిగింది. ఆమెను నరికి చంపి మొండెం నుంచి తలను వేరు చేసింది. అనంతరం ఆ తలను తీసుకెళ్లి పొరుగింటి వారి ఫుట్ పాత్ పై పడేసింది. విషయం గమనించిన ఆ ఇంటి వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ దృశ్యం చూసి భయపడ్డారు. తమ కెరీర్లో ఇంత దారుణమైన ఘటనను చూడలేదని పోలీసులు చెప్పారు. తల్లి హత్య అనంతరం గార్డెన్లో కూర్చున్న కూతురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సదరు యువతిని పారామట్టా బెయిల్ కోర్టులో వీడియో లింక్ ద్వారా హాజరుపరచగా తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. అయితే నిందితురాలు బెయిల్ కోసం అప్లై చేసుకోలేదు.
నిందితురాలి బంధువులకు చెందిన నాలుగేళ్ల అబ్బాయి ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అని పోలీసులు చెప్పారు. తలకు చిన్న గాయమైన ఆ చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. నిందితురాలు కన్న తల్లిని ఎందుకు చంపిందన్న విషయంపై ఇప్పటికీ స్పష్టతరాలేదని పోలీసులు చెప్పారు.