నాన్సీ ల్యాప్టాప్ చోరీ? రష్యా ఇంటలిజెన్స్కు చేరవేసే ప్లాన్.. ఎఫ్బీఐ అఫిడవిట్లో సంచలనాలు..
ఈ నెల 6న వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనంపై దాడి సందర్భంగా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోన్సీ కార్యాలయంలోకి చొరబడ్డ రిలే జూన్ విలియమ్స్ అనే మహిళను తాజాగా ఫెడరల్ అధికారులు అరెస్ట్ చేశారు. పెలోసీ ల్యాప్టాప్ లేదా హార్డ్ డ్రైవ్ను ఆమె దొంగిలించిందని అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాదు,దొంగిలించిన దాన్ని ఆమె రష్యా ఇంటలిజెన్స్కు అమ్మేందుకు యత్నించారని అనుమానిస్తున్నారు. సోమవారం(జనవరి 18) పెన్సిల్వేనియాలోని విలియమ్స్ నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఆ ల్యాప్టాప్ ఇప్పటికీ ఆమె వద్దే ఉందా..?
రిలే జూన్ విలియమ్స్ అరెస్టుకు సంబంధించి కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టులో ఎఫ్బీఐ అధికారులు అఫిడవిట్ దాఖలు చేశారు. ల్యాప్టాప్ దొంగతనానికి సంబంధించి విలియమ్స్ మాజీ ప్రియుడు తమకు సమాచారం ఇచ్చినట్లుగా అందులో పేర్కొన్నారు. 'ఆమె దాన్ని రష్యాలోని ఓ స్నేహితుడికి ... అతని నుంచి రష్యా ఫారిన్ ఇంటలిజెన్స్ సర్వీస్కు పంపించాలని ప్లాన్ చేసింది.' అని విలియమ్స్ ప్రియుడు పేర్కొన్నట్లుగా ఎఫ్బీఐ వెల్లడించింది. అయితే అనుకోని కారణాలతో విలియమ్స్ ఆ పనిచేయలేదని... కాబట్టి ఇప్పటికీ ఆమె వద్దే ఆ ల్యాప్టాప్ లేదా డ్రైవ్ ఉండాలని అతను పేర్కొన్నట్లు చెప్పింది. లేదంటే ఆమె దాన్ని ధ్వంసం చేసి ఉండొచ్చునని చెప్పినట్లు తెలిపింది.
ట్రెస్పాస్ కేసు నమోదు...
ఎఫ్బీఐ తెలిపిన వివరాల ప్రకారం... విలియమ్స్ పెన్సిల్వేనియాలోని హారిస్బర్గ్లో తన తల్లితో కలిసి ఉంటున్న ఆమె నివాసం నుంచి మరో చోటుకు పారిపోయింది. ఇటీవల ఆమె తన ఫోన్ నంబర్ను డీయాక్టివేట్ చేయడంతో పాటు తనకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా ఖాతాలను తొలగించింది. ప్రస్తుతం విలియమ్స్పై ట్రెస్ పాస్(అనుమతి లేకుండా ఇతరుల కార్యాలయంలోకి చొరబడటం) కేసును నమోదు చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికైతే ఆమెపై దొంగతనం కేసు నమోదు చేయలేదని పేర్కొంది.
క్యాపిటల్ భవనంపై దాడి సందర్భంగా
ఈ నెల 6న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్ వీధుల్లో సేవ్ అమెరికా ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత క్యాపిటల్ భవనం వద్దకు చేరుకున్న నిరసనకారులు అక్కడ అల్లర్లకు పాల్పడ్డారు. ఆ సమయంలో రీలే జూన్ విలియమ్స్ అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి కార్యాలయంలోకి చొరబడ్డారు. ఈ సందర్భంగా ఆమె ల్యాప్టాప్ దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆరోజు అల్లర్లలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లో నూతన అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.