ఇరాన్లో మిలియన్ల జనం చనిపోయే ప్రమాదం.. కరోనాపై అధినేత సంచలన హెచ్చరిక..
ఓవైపు కరోనా వైరస్ నియంత్రణ కోసం ఇరాన్ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తుంటే.. మరోవైపు అక్కడి మతపరమైన శక్తులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. అనవసర ప్రయాణాలు,సందర్శనలను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంటే.. ఇలాంటి క్లిష్ట తరుణంలోనే ఇస్లాం పట్ల ఆరాధన భావాన్ని చాటుకోవాలని మత పెద్దలు,ప్రభోదకులు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇరాన్లో ఇప్పటికీ మసీదులు,దర్గాలను జనం సందర్శించుకుంటూనే ఉన్నారు. ఈ పరిస్థితులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమేనీ తీవ్ర అసంతృప్తి,అసహనం వ్యక్తం చేశారు.
మిలియన్ల మంది చనిపోయే ప్రమాదం..
ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా ప్రజలు తమ ఇష్టారీతిన అనవసర ప్రయాణాలు చేయడం.. ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించకపోవడంపై అయతుల్లా ఖొమేనీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగే చేస్తే ఇరాన్లో మిలియన్ల సంఖ్యలో ప్రజలు కరోనా వైరస్ బారినపడి చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే దేశంలో "అనవసరమైన" ప్రయాణాలను నిషేధిస్తూ మతపరమైన తీర్పును కూడా జారీ చేశారు. అయినప్పటికీ ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవట్లేదు. కరోనా తమను ఏమీ చేయలేదని.. ఇలాంటి సమయంలోనే ఇస్లాం పట్ల తమ ఆరాధనను చాటుకోవాలని అక్కడి మత ప్రబోధకులు పిలుపునిస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు మసీదులకు వెళ్లడమే కాదు.. కొన్నిచోట్ల మసీదుల కిటికీలను నాకుతూ.. తమకు కరోనా రానే రాదని సవాల్ విసురుతున్నారు.
254 మంది భారతీయ యాత్రికులకు పాజిటివ్
ఇక ఇరాన్లో చిక్కుకుపోయిన భారత యాత్రికుల్లో 254 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. అక్కడి ఇండియన్ మెడికల్ టీమ్ వారికి వైద్య పరీక్షలు నిర్వహించింది. దీనికి సంబంధించి ఇరాన్లోని కోమ్ నగరంలో చిక్కుకుపోయిన భారత యాత్రికుడు ఒకరు ఆ జాబితాను బయటకు వెల్లడించారు. అందులో వైరస్ సోకిన భారత యాత్రికుల పేర్లు,వారి పాస్పోర్ట్ నెంబర్స్,కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి.
గందరగోళంలో యాత్రికులు
ఇరాన్లో చిక్కుకుపోయిన 254 మంది భారతీయ యాత్రికులు గ్రూపులు గ్రూపులుగా విడిపోయి పలు ప్రాంతాల్లో ఉన్నారు. ఇందులో ఎక్కువమంది కోమ్ నగరంలో ఉండగా.. మరికొందరు టెహ్రాన్లో ఉన్నారు. మొత్తం యాత్రికుల్లో 80మంది విద్యార్థులు కూడా ఉన్నారు. యాత్రికుల్లో ఒకరైన అస్గర్ అలీ అనే వ్యక్తి.. తమను త్వరగా భారత్కు రప్పించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. మరో ఆసక్తికర విషయాన్ని కూడా అతను వెల్లడించాడు. ఇండియన్ మెడికల్ టీమ్ నిర్వహించిన వైద్య పరీక్షల్లో తమకు కరోనా పాజిటివ్ అని తేలగా.. ఇరాన్ ఆసుపత్రుల్లో మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోగా..అందులో నెగటివ్ అని తేలిందన్నారు. దాంతో అంతా గందరగోళంగా అనిపిస్తోందని.. వీలైనంత త్వరగా ఇక్కడినుంచి బయటపడాలనుకుంటున్నామని చెప్పారు.
Recommended Video
85వేల మంది ఖైదీల విడుదల
మరోవైపు కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దాదాపు 85వేల మంది ఖైదీలను ఇరాన్ ప్రభుత్వం తాత్కాలికంగా విడుదల చేసింది. ఇందులో పలువురు రాజకీయ ఖైదీలు కూడా ఉన్నారు. ఇరాన్లో ఐరాస మానవ హక్కుల ప్రతినిధి జావెద్ రెహమాన్ రాజకీయ ఖైదీల విడుదల కోసం మార్చి 10న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేలాదిమంది ఖైదీలను విడుదల చేసింది. ప్రస్తుతం ఇరాన్లో 14991 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు 853 మంది మృతి చెందారు. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం.. చైనా తర్వాత ఇరాన్లోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.