B.1.617: భారత్లో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్: డబ్ల్యూహెచ్ఓ కన్ఫర్మ్: మోస్ట్ డేంజరస్
జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ యధాతథంగా కొనసాగుతోంది. లక్షలాది మంది కనిపించని ఈ మహమ్మారికి బలి అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దుష్ప్రభావం అన్ని దేశాల కంటే భారత్లో ఊహించిన స్థాయిలో ఉంటోంది. దేశవ్యాప్తంగా మూడున్నర నుంచి నాలుగు లక్షల వరకు రోజువారీ కరోనా కేసులు రికార్డవుతున్నాయి. మూడున్నర వేల మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. యాక్టివ్ కేసులు 37 లక్షలను దాటేశాయి.
ఈ పరిస్థితుల్లో భారత్లో మరో కొత్త రకం కరోనా వైరస్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. బీ.1.617 (B.1.617) రకం వేరియంట్ ఇది. భారత్లో ఈ వేరియంట్ పుట్టుకొచ్చిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ధృవీకరించింది కూడా. ఇప్పుడున్నకరోనా వైరస్ కంటే ఇది 15 రెట్లు అత్యంత ప్రమాదకరమైనదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ (DOH) పేర్కొంది. ఈ కొత్త రకం వేరియంట్ ప్రపంచ స్థాయిలో ఆందోళన కలిగించేదిగా డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ టీమ్ హెడ్ మారియా వాన్ కెర్ఖోవ్ అభివర్ణించారు.
దేశంలో కరోనా వైరస్కు చెందిన డబుల్ మ్యూటెంట్ వేరియంట్ B.1.617 దాడి చేసిందని కెర్ఖోవ్ స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఈ వేరియంట్ పుట్టుకొచ్చినట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న సెంటర్ ఫర్ సెల్యూలర్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) శాస్త్రవేత్తలు ఇదివరకే గుర్తించిన విషయం తెలిసిందే. N440K వేరియంట్ను బీ.1.617 రీప్లేస్ చేసిందని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు. ఈ రకం వేరియంట్ దక్షిణాది రాష్ట్రాల్లో విపరీతంగా వ్యాప్తి చెందిందని పేర్కొంది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది.
Recommended Video
యూకేలో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన బీ.1.1.7 (B.1.1.7), బ్రెజిల్-పీ.1, దక్షిణాఫ్రికా-బీ.1.351 రకం కంటే ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించామని కెర్ఖోవ్ తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు.. ఈ వేరియంట్పై పనిచేస్తాయా? లేవా? అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఈ రకం వేరియంట్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రస్తుతం అనుసరిస్తోన్న ప్రొటోకాల్స్ను మరింత కట్టుదిట్టం చేయాల్సి ఉండొచ్చని, కఠినంగా అమలు పర్చాల్సిన అవసరం తలెత్తవచ్చిన అభిప్రాయపడ్డారు.