ప్రధాని మోడీని సోదరుడిగా సాయం కోరిన కరీమా బలోచ్ దారుణ హత్య: పాక్ దుశ్చర్యే
ఒట్టావా: ప్రధాని నరేంద్ర మోడీని సోదరుడితో పోలుస్తూ సాయం కోరిన బలోచిస్థాన్ ఉద్యమకారిణి కరీమా బలోచ్ కెనడాలో హత్యకు గురయ్యారు. పాకిస్థాన్ ఆక్రమిత బలోచిస్థాన్ నుంచి 2016 తప్పించుకుని కెనడాలో శరణార్థిగా జీవిస్తున్న ఆమెను కొందరు వేటాడి హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని మంగళవారం టొరెంటో నగరానికి సమీపంలో కనుగొన్నారు. ఆమె మృతికి 40 రోజులు సంతాప దినాలు పాటించాలని బలోచ్ నేషనల్ మూవ్మెంట్ పిలుపునిచ్చింది.
యువ హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ హాట్ ఫోటో గ్యాలరీ.. ట్రెండింగ్గా గ్యాలరీ
ప్రధాని మోడీని సోదరుడిగా పోలుస్తూ కరీమా సందేశం
ఇది ఇలావుండగా, 2016 రక్షాబంధన్ రోజున ప్రధాని నరేంద్ర మోడీకి కరీమా బలోచ్ ఓ సందేశం పంపారు. ఈ సందేశాన్ని అప్పటి బలోచ్ స్టూడెంట్ ఆర్గనైజైషన్ ఛైర్పర్సన్ కరీమా బలోచ్ రికార్డు చేసి తారేఖ్ ఫతాహ్ అనే పాకిస్థాన్ సంతతి కెనడా రచయిత యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. అప్పట్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, కరీమా సందేశం కంటే ముందే 2016లో భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున బలోచ్ అంశాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించడం గమనార్హం.
చివరి వరకు బలోచ్ ఉద్యమకారిణిగానే..
కాగా, కరీమా హత్య వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన చివరి వరకు కూడా బలోచిస్థాన్ కోసమే పోరాడారు కరీమా బలోచ్. డిసెంబర్ 14న కరీమా తన ట్విట్టర్ ఖాతాలో చివరిసారి ట్వీట్ చేశారు. బోలచ్ ఉద్యమకారులను రక్షించాలని ఆమె కోరారు. పాక్ సైన్యం తమ వారిని కిడ్నాప్, హత్యలు చేస్తోందన్నారు. కెనడాలో స్థిరపడిన పాక్ జనరల్స్ను కరీమా తీవ్రంగా విమర్శించారు. కాగా, మే నెలలో బలోచ్ జర్నలిస్టు సాజిద్ హుస్సేన్ను స్వీడన్లో పాకిస్థాన్ గుండాలు హత్య చేశారు.
ప్రభావశీల మహిళగా కరీమా బలోచ్.. పాక్ అరాచకాలకు బలి
బీబీసీ 2016లో ప్రచురించిన 100 మంది అత్యంత ప్రభావంతమైన మహిళల జాబితాలో కరీమా కూడా స్థానం దక్కించుకున్నారు. కాగా, బలోచిస్థాన్ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్న ఉద్యమకారులను పాక్ తీవ్రంగా అణిచివేస్తోంది. పాక్ సైన్యంతోపాటు డెత్ స్క్వాడ్స్.. ఉగ్రవాదుల సహకారంతో బలోచిస్థాన్ ఉద్యమకారులను ఆ ప్రాంతంలోనివారితోపాటు ఇతర దేశాల్లో ఉన్నవారిని కూడా తుదిముట్టిస్తోంది. పాకిస్థాన్ కిరాతకాలపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.