చైనా కూడా ఇండియా ప్రాడక్ట్స్ బ్యాన్ చేస్తే.. కోలుకోలేని దెబ్బన్న డ్రాగన్.. ప్రతీకార హెచ్చరిక..
పౌరుల డేటా చోరీ, దేశ భద్రతకు విఘాతం అనే కారణాలతో చైనాకు చెందిన 59 యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఐటీ చట్టంలోని 69ఏ సెక్షన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. గడిచిన రెండు నెలలుగా సరిహద్దు వెంబడి హింసాత్మక దురాగతాలకు పాల్పడుతోన్న చైనాకు దీటుగా బదులిస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన నేపథ్యంలో యాప్స్ పై నిషేధాన్ని 'డిజిటల్ స్ట్రైక్స్'గా భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపించే ఈ నిర్ణయంపై చైనీస్ మీడియా ఊహించినట్లుగానే స్పందించింది.
చైనాకు షాక్..బలూచిస్తాన్లో సీన్ రివర్స్.. పాక్ స్టాక్ ఎక్సేంజ్పై దాడి బీఎల్ఏ పనే.. భారత్ ప్రమేయం?
నష్టం ఇండియాకే..
టిక్ టాక్, హలో, యూసీ బ్రౌజర్ సహా మొత్తం 59 యాప్ లపై కేంద్రం నిషేధం ప్రకటించిన కొద్ది గంటలకే ప్లే స్టోర్ నుంచి వాటిని తొలగించారు. ఇప్పటికే భారత్ కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాల మేరకు చైనా వస్తువులపై నిషేధం ఈజీగా అయ్యేపనికాదు. యాప్ లను నిషేధించడం ద్వారా ముందుగా డేటా చోరీని అరికట్టవచ్చన్నది మోదీ సర్కార్ ఎత్తుగడలా కనిపిస్తోంది. అయితే, ఈ ఎలా చూసినా ఈ నిర్ణయం ఇండియాకే నష్టం చేస్తుందని, చైనాపై ప్రభావం తక్కువని ఆ దేశ మీడియా బీరాలు పోయింది.
బైకాట్ ఇండియన్ ప్రాడక్ట్స్?
చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నడిచే ‘గ్లోబల్ టైమ్స్', ‘చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్ వర్క్(సీజీటీఎన్)' సహా అన్ని మీడియా సంస్థలూ.. యాప్స్ నిషేధం వార్తల్ని అండర్ ప్లే చేశాయి. ఇండియాకు కలిగే నష్టాన్ని మాత్రమే ప్రస్తావించాయి. ‘‘సార్వభౌమాధికారం, సమగ్రత పేరుతో టిక్ టాక్ సహా 59 యాప్ లపై నిషేధం విధించడం డొల్ల నిర్ణయంలా కనిపిస్తోంది. ఇండియా తనకు తానే వ్యాపార వాతావరణాన్ని పాడుచేసుకుంటోంది. విదేశీ పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది'' అని సీజీటీఎన్ పేర్కనగా, గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హూ జీజిన్ మరో అడుగు ముందుకేసి.. చైనాలో ఇండియా ప్రాడక్ట్స్ నిషేధాన్ని ప్రస్తావించారు..
జాతీయవాదం కన్నా గొప్పవి..
‘‘అది సరే, మరిప్పుడు చైనా కూడా ఇండియన్ ప్రాడక్ట్స్ ను బ్యాన్ చేసే, చైనా ప్రజలు ‘బైకాట్ ఇండియా'పిలుపునిచ్చే అవకాశమేలేదే! మా దగ్గర పట్టుమని పదైనా ఇండియన్ గూడ్స్ లేవే!!''అని హూ జీజిన్ వ్యాఖ్యానించారు. అంటే, ఇండియా లాంటి దేశాల్లో చైనా వస్తువులే తప్ప.. చైనాలో ఇండియా, ఇతర దేశాల వస్తువులు లేనేలేవని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నారు. అంతటితో ఆగకుండా, జాతీయవాదం కన్నా గొప్పవి, ముఖ్యమైన వ్యవహారాలు చాలా ఉంటాయని ఇండియన్లు గుర్తించాలని, సమస్యల పరిష్కారం కోసం చైనా ఆర్మీ ముందుకొచ్చినా ఇండియానే తెంపరితనాన్ని ప్రదర్శిస్తోందని గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ అవాకులు పేలారు. త్వరలోనే ఇండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
నష్టనివాణ చర్యలు..
నిజానికి చైనీస్ యాప్ లపై నిషేధం పెద్ద విషయమే అయినా.. నష్టనివారణ చర్యల్లో భాగంగా చైనీస్ మీడియా ఈ అంశాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నది. ఒక్క టిక్ టాక్ యాప్ నే తీసుకుంటే 30 శాతానికి పైగా యూజర్లు, 10 శాతానికిపైగా ఆదాయం ఇండియా నుంచి ఉంటుంది. చైనా ఆర్థిక వ్యవస్థకు ఎంతో కొంత నష్టం తప్పదు. భారత్ ను చూసి మిగతా దేశాలు కూడా చైనా కంపెనీలపై నిషేధం ప్రకటిస్తే అప్పుడు డ్రాగన్ కోరల్ని పూర్తిగా ఊడబెరికినట్లవుతుంది.
Recommended Video
కంపెనీల గగ్గోలు..
డేటా చౌర్యం ఆరోపణలపై నిషేధాన్ని ఎదుర్కొంటున్న 59 కంపెనీలు తామే తప్పూ చేయలేదని గగ్గోలు పెడుతున్నాయి. యూజర్లకు సంబంధించిన వివరాలను రహస్యంగానే ఉంచుతున్నామని, చైనా సహా ఏ ప్రభుత్వానికీ, థర్డ్ పార్టీకీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదని టిక్టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ వివరణ ఇచ్చారు. డేటా చోరీ అనుమానాలుంటే తనిఖీ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని ఆయన వాపోయారు. కేంద్రం నిషేధం విధించిన కొద్ది గంటలకే టిక్ టాక్ సిస్టర్ కంపెనీ హెలో, క్లబ్ ఫ్యాక్టరీ, షేర్ఇట్, యూసీ బ్రౌజర్ సహా మొత్తం 59 చైనీస్ యాప్ లను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి తొలగించేశారు.