బంగ్లాదేశ్లో హిందూ దేవాలయంపై బాంబులతో దాడి
ఢాకా: బంగ్లాదేశ్లో ఓ హిందూ దేవాలయం పైన బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో పదిమంది వరకు గాయపడ్డారు. బంగ్లా ఉత్తర ప్రాంతంలోని ప్రాచీన దేవాలయ ప్రాంగణంలో శనివారం నాడు కొంతమంది గుర్తు తెలియని దుండగులు నాటు బాంబులతో దాడికి పాల్పడ్డారు.
హిందూ పండుగ రష్ మేళాను పురస్కరించుకుని దినాజ్పూర్లో కాంతాజీ దేవాలయం వద్దకు వేలాది భక్తులు వచ్చారు. ఆ సమయంలో దాడి జరిగింది. బంగ్లాదేశ్లో ఇస్లామిక్ చాందసవాదులు గత కొంతకాలం నుంచి వరుసగా దాడులు చేస్తున్నారు. తాజాగా ఇది మరో దాడి.
రష్ మేళా సందర్భంగా కాంతాజీ ఆలయం వద్ద అయిదువేల మంది వరకు భక్తులు ఓపెన్ ఎయిర్ షోను తిలకిస్తుండగా దుండగులు మూడు నాటు బాంబులతో దాడికి తెగబడ్డారు. గాయపడ్డ వారిలో చాలామందికి బాంబుల్లో అమర్చిన మేకులు, గాజు పెంకులు గుచ్చుకున్నాయి.
ఈ దాడి జరిగిన అనంతరం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ముమ్మర దర్యాప్తు నిర్వహిస్తున్నామని, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ ముగ్గురు వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని పోలీసులు చెప్పారు.