బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం...70 మంది మృతి
బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బహుళ అంతస్తు భవనంలో మంటలు చెలరేగడంతో 70 మంది మృతి చెందారు. పాత ఢాకాలోని చాక్ బజార్ ప్రాంతంలోని నందకుమార్ లేన్లో ఉన్న భవంతిలో మంటలు చెలరేగాయి. బుధవారం రాత్రి ఈ ఘోరం సంభవించిందని చెప్పిన అధికారులు మంటల్లో చిక్కుకుని 70 మంది మృతి చెందినట్లు ఫైర్ సర్వీసు ఆఫీసర్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజిన్లు రంగ ప్రవేశం చేసి మరింత ప్రాణ నష్టం జరగకుండా మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు చెప్పారు.
ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఆ దేశ హోంశాఖ మంత్రి అసదుజమాన్ ఖాన్ కమల్. పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆయన చెప్పారు. ఇక అగ్నికి ఆహుతి అయిన వారి మృతదేహాలను భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన వారిలో 58 మంది పురుషులుండగా.. ఐదుగురు మహిళలు మిగతావారు చిన్న పిల్లలు ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలు గుర్తించడం జరిగిందని అధికారులు వివరించారు.
ఇక మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన వారిని అతికష్టం మీద బయటకు తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్పించామని చెప్పిన అధికారులు చికిత్స పొందుతున్న వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఇక ప్రమాదం గురించి వివరిస్తూ భవంతిలో చెలరేగిన మంటలు క్రమంగా పక్క భవంతులకు వ్యాపించాయని పోలీసులు వెల్లడించారు. ఓ గోడౌనులో భధ్రపరిచిన కెమికల్స్కు మంటలు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెప్పారు.
ఇక బుధవారం రాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాదం 2010 జూన్ 3న జరిగిన అగ్ని ప్రమాదాన్ని గుర్తుతెచ్చింది. నాడు నిమ్టోలీ ప్రాంతంలో సంభవివించిన ఈ ప్రమాదంలో 124 మంది మృతి చెందారు.