148 మందితో వెళ్తున్న విమానం హైజాక్, హైజాకర్ను కాల్చి చంపిన భద్రతా దళాలు
ఢాకా: బంగ్లాదేశ్లో ఓ వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేశాడు. అతనిని బంగ్లాదేశ్ ప్రత్యేక దళాలు కాల్చి చంపేశాయి. బిమాన్ ఎయిర్ లైన్కు చెందిన బీజీ 147 విమానాన్ని గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేయడానికి ప్రయత్నించారు.
బంగ్లాదేశ్కు చెందిన ఆ విమానం ఢాకా నుంచి చిట్టగాంగ్ మీదుగా దుబాయికి బయలుదేరాల్సి ఉంది. ఢాకా నుంచి విమానం బయలుదేరిన కాసేపటికి చిట్టగాంగ్లోని షా అమానత్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు.
అయితే ఈ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించారని, అందుకే విమానాశ్రయంలో దిగాల్సి వచ్చిందని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. హైజాకర్గా భావిస్తున్న వ్యక్తి ఇప్పటికీ విమానంలోనే ఉన్నాడు. అనంతరం పోలీసులు, ఇతర భద్రతా బలగాలు విమానాశ్రయానికి చేరుకున్నాయి. విమానం నుంచి ప్రయాణికులందరినీ సురక్షితంగా దించారు.
తమతో కలిసి ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి వద్ద తుపాకీ వంటి వస్తువు ఉందని ఓ ప్రయాణికుడు విమానంలో ఉన్న పోలీసులకు తెలిపారు. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా దించి, ప్రయాణికులను దించేసినట్లు తెలిపారు. చివరకు హైజాకర్గా భావిస్తున్న ఆ వ్యక్తిని భద్రతా బలగాలు తొలుత అరెస్టు చేసినట్లు, ఆ తర్వాత కాల్చి చంపినట్లు వార్తలు వచ్చాయి. విమానంలో 148 మంది ప్రయాణీకులు ఉన్నారు.