బంగబంధు హంతకుడి ఉరితీత: అర్ధరాత్రి పెను సంచలనం 45 సంవత్సరాల తరువాత.. !
ఢాకా: కరోనా వైరస్ విధ్వంసాన్ని సృష్టిస్తోన్న మన పొరుగుదేశం బంగ్లాదేశ్ సంచలనాన్ని రేపింది. తమ దేశ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మాన్ హంతకుడిని ఉరి తీసింది. బంగ్లాదేశ్ మొట్టమొదటి అధ్యక్షుడు ఆయనే. అర్ధరాత్రి 12.01 నిమిషాలకు దేశ రాజధాని ఢాకాలోని కేంద్ర కారాగారంలో ఆయనను ఉరి తీసినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ హత్యాకాండ చోటు చేసుకున్న 45 సంవత్సరాల తరువాత హంతకుడిని ఉరి తీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
1975లో హత్యాకాండ..
బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజీబుర్ రెహ్మాన్ను బంగబంధుగా పిలుస్తుంటారు ఆ దేశ ప్రజలు. జాతిపితగా కొలుస్తుంటారు. 1975లో ఆయన దారుణ హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్ ఉన్నత సైనికాధికారి కేప్టెన్ అబ్దుల్ మాజీద్.. ఈ కేసులో ప్రధాన దోషిగా తేలారు. ఆయన ప్రధాన దోషిగా తేలిన తరువాత బంగ్లాదేశ్ ప్రభుత్వం సైన్యం నుంచి ఉద్వాసన పలికింది. విచారణ చేపట్టింది. షేక్ ముజీబుర్ రెహ్మాన్ హత్యాకాండకు అబ్దుల్ మాజీద్ ప్రధాన సూత్రధారిగా తేలింది. ఆయనకు ఉరిశిక్షను విధించింది న్యాయస్థానం.
45 సంవత్సరాల తరువాత..
శిక్ష ఖరారైనప్పటి నుంచి ఆయన ఢాకా కెరనిగంజ్ ప్రాంతంలో ఉన్న కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. ఈ అర్ధరాత్రి దాటిన తరువాత ఉరి తీశారు. ఈ విషయాన్ని ఢాకా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మహబుబ్ ఉల్ ఇస్లాం తెలిపారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం ధృవీకరించింది. ఉరి తీసే సమయంలో సంఘటనా స్థలంలో జైళ్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ ఏకేఎం ముస్తఫా కమాల్ పాషా, సివిల్ సర్జన్, ఢాకా జిల్లా మెజిస్ట్రేట్ తదితరులు ఉన్నట్లు వెల్లడించింది. అబ్దుల్ మాజీద్ భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలం భోలా గ్రామానికి పంపించినట్లు అధికారులు తెలిపారు.
కుటుంబం మొత్తం దారుణ హత్య..
1975 ఆగస్టు 15వ తేదీన బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయనతో పాటు పదిమంది కుటుంబ సభ్యులను మిలటరీ జవాన్లు హత్య చేశారు. హత్యకు గురైన వారిలో ఆయన భార్య షేక్ ఫజీలతున్నీసా ముజీబ్, ముగ్గురు కుమారులు కేప్టెన్ షేక్ కమాల్, లెప్టినెంట్ షేక్ జమాల్, పదేళ్ల వయస్సున షేక్ రసెల్, ఇద్దరు కుమార్తెలు, కోడళ్లు సుల్తానా కమాల్, రోసీ జమాల్, షేక్ నజీర్, అబ్దుల్ రబ్, షేక్ ఫజలులు హక్, అర్జూ మని తదితరులు ఉన్నారు. రక్షణశాఖ కార్యదర్శి బ్రిగేడియర్ జనరల్ జమీల్ కూడా హత్యకు గురయ్యారు.
Recommended Video
బంగ్లాదేశీయుల్లో హర్షం..
ఈ హత్యాకాండలో అబ్దుల్ మాజీద్ సహా సయ్యద్ ఫరూఖ్ రెహ్మాన్, సుల్తాన్ షెహర్యార్ రషీద్ ఖాన్, బజ్లుల్ హుదా, ఏకేఎం మొహియుద్దీన్, మొహియుద్దీన్ అహ్మద్ దోషులుగా తేలారు. అబ్దుల్ మాజీద్ మినహా మిగిలిన వారందరినీ 2010లోనే ఉరి తీశారు. తాజాగా అబ్దుల్ మాజీద్ను ఉరి తీశారు. దీనితో ఈ హత్యోదంతంలో ప్రమేయం ఉన్న వారందరూ ఉరికంబం ఎక్కినట్టయిందంటూ బంగ్లాదేశీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.