బంగ్లాదేశ్ సంచలనం: అధికార మతంగా ఇస్లాం తొలగింపు యోచన
ఢాకా: బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. దేశ అధికార మతంగా ఇస్లాంను బంగ్లాదేశ్ తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల దేశంలోని ఇతర విశ్వాసాలు గల ప్రజలపై తరుచూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇటీవల దేశంలో హిందూ, క్రిస్టియన్, ముస్లిం షియా మైనారిటీలపై ఇస్లామిక్ అతివాదులు దాడులకు పాల్పడుతోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం బంగ్లాదేశ్ సుప్రీం కోర్టులో ఇస్లాం మతాన్ని అధికార మతంగా తొలగించే అంశంపై వాదనలు కొనసాగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. 1988 నుంచి బంగ్లాదేశ్లో ఇస్లాం అధికార మతంగా కొనసాగుతోంది.
ఇస్లాంను అధికార మతంగా కొనసాగించడం చట్ట విరుద్దమని మైనారిటీ మతాల నేతలు వాదిస్తున్నారు. బంగ్లాదేశ్లో 90 శాతం మంది ముస్లింలు కాగా, ఎనిమిది శాతం మంది హిందువులు, రెండు శాతం మంది ఇతర మతాల వారు ఉన్నారు.
పంచగర్ జిల్లాలో ఓ హిందూ పూజారిని ముస్లిం అతివాదులు కొద్ది రోజుల క్రితం హత్య చేసిన విషయం తెలిసిందే. ఇలాంటివి గతంలో కూడా ఎన్నో జరిగాయి. జుమతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్, అన్సరుల్లా బంగ్లా ఇస్లామిస్టు గ్రూప్లు విదేశీయులు, మైనారిటీ ప్రజలపై దాడులకు పాల్పడుతున్నట్టుగా భావిస్తున్నారు.