తమన్నాపై వేటు: మరొకరితో పరీక్ష రాయించడంతో సస్పెండ్ చేసిన యూనివర్శిటీ
ఢాకా: బంగ్లాదేశ్లో ఓ మహిళా ఎంపీపై బహిష్కరణ వేటు పడింది. బహిష్కరణ వేటు అంటే ఏ పార్లమెంటు నుంచో కాదు ఓ యూనివర్శిటీ నుంచి బహిష్కరణకు గురైంది. అసలే ఎంపీ.. అదికూడా యూనివర్శిటీ యాజమాన్యం బహిష్కరణ వేయడమేంటి. ఆమె ఒక ప్రజాప్రతినిధి కదా అని మీకు అనుమానం రావొచ్చు. కానీ మన ఎంపీ వ్యవహరించిన తీరు చూస్తే ముక్కున వేలు వేసుకుంటారు. ఇంతకీ ఆ కథాకమామిషీ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
విధి రేప్ లాంటిదే.. ఎర్నాకులం కాంగ్రెస్ ఎంపీ భార్య కాంట్రవర్సీ కామెంట్స్
మరొకరితో పరీక్ష రాయించిన మహిళా ఎంపీ
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న మహిళా ఎంపీ పేరు తమన్నా నుస్రత్. ఈమె అధికార పార్టీ అవామీ లీగ్ ఎంపీ. ఈమె చేసిన ఘనకార్యం గురించి తెలుసుకుంటే ముక్కున వేలు వేసుకుంటారు. ఎంతైనా ప్రజాప్రతినిధి కాబట్టి నిత్యం బిజీగా ఉండటంతో ఆమె రాయాల్సిన యూనివర్శిటీ పరీక్షలు మరికొందరితో రాయించింది. ఇందుకోసం ఎంపీ కాస్త హోంవర్క్ కూడా చేసింది. యూనివర్శిటీ చాలా కఠినంగా వ్యవహరిస్తోందని తెలిసి ఆమెలా పోలీ ఉన్న ఎనిమిది మందిని ఎంపిక చేసి వారు తన కోసం పరీక్ష రాయాల్సిందిగా కోరింది. ఇందుకోసం డబ్బులు కూడా చెల్లిస్తానంటూ ఒప్పందం కుదుర్చుకుంది ఎంపీ తమన్నా నుస్రత్.
టీవీ ఛానెల్ ఎంటర్ అవడంతో...
మొత్తం 13 పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే తమన్నా పక్కాగా స్కెచ్ వేసినప్పటికీ అది సక్సెస్ కాలేదు. ఎంపీ పరీక్ష రాస్తున్నారన్న విషయం తెలిసిన నాగోరిక్ అనే టీవీ ఛానెల్ పరీక్ష హాలులోకి కెమెరాలతో వెళ్లింది. ఇంకేముంది... ఎంపీ బాగోతం బయటపడింది. అక్కడ చూస్తే తమన్నా నుస్రత్లా మరో మహిళ పరీక్ష రాస్తోంది. దీన్నే పదేపదే టెలికాస్ట్ చేసింది ఛానెల్. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది. ఇది గమనించిన యాజమాన్యం ఎంపీ తమన్నాపై వేటు వేసింది.
ఎవరైనా సరే నేరం నేరమే..
గతేడాది తమన్నా నుస్రత్ అవామీ లీగ్ పార్టీ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆమె బంగ్లాదేశ్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుతున్నారు. అయితే పరీక్షల కోసం మాత్రం ఇతరులను కూర్చోబెట్టారు. వ్యవహారం బయటకు పొక్కడంతో ఎంపీ అయినా సరే మరెవరైనా సరే నేరం చేశారు కాబట్టి వారిపై వేటు పడుతుంది అని చెప్పి తమన్నాను యూనివర్శిటీ బహిష్కరించింది. ఇక భవిష్యత్తులో ఆమె ఎప్పటికీ ఈ యూనివర్శిటీలో చదివేందుకు అనుమతి ఉండదు. ఇక ఎంపీ కోసం పరీక్ష రాసేందుకు వచ్చిన యువతులకు తోడుగా గన్మ్యాన్లు వచ్చేవారు. ఇది అందరికీ తెలిసినప్పటికీ ఎవరూ మాట్లాడలేదు. ఎందుకంటే ఎంపీ తమన్నా నుస్రత్ బంగ్లాదేశ్లోని అత్యంత ప్రభావితం చేయగల కుటుంబం నుంచి వచ్చారు. ఘటనపై స్పందించేందుకు నుస్రత్ అందుబాటులో లేరు.
ఇదంతా ఇలా ఉంటే పరీక్షలు, మోసాలు, పరీక్ష పత్రాల లీకేజీలు, బంగ్లాదేశ్లో సర్వసాధారణం. అందుకే చాలా సార్లు బంగ్లాదేశ్లో జరిగే పరీక్షలు ఏదో ఒక కారణం చేత రద్దవుతూ ఉంటాయి. చదువకునే విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టివేస్తూ ఉంటారు.