ఓడిన సైన్యం ఇంకేం చేస్తుంది: పాక్ని దులిపేసిన షేక్ హసీనా, నేపాల్ కూడా..
ఢాకా: పాకిస్తాన్ పైన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవాల్సిన సార్క్ దేశాల సమావేశాలు రద్దు కావడానికి పాక్ వైఖరే కారణమని దుయ్యబట్టారు. పాక్ సైన్యాన్ని.. ఓడిపోయిన సైన్యంగా ఆమె అభివర్ణించారు.
దెబ్బ తిన్నదని
1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాక్ సైన్యం చావు దెబ్బ తిన్నదని షేక్ హసీనా అన్నారు. ఆమె ఐక్య రాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. యుద్ధ నేరాలు చేసిన వారికి తమ దేశం మరణశిక్షలను అమలు చేస్తుంటే వాటిని నిరసిస్తూ ఇస్లామాబాదులో ప్రదర్శనలు జరుగుతుండటంతో తాము సార్క్ సమావేశాలకు హాజరు కారాదని నిర్ణయించామన్నారు.
ఓడిపోయిందని
పాక్ సైన్యం ఏనాడో ఓడిపోయిందని, మేము వారిని 1971లో ఓడించామని, ఓడిపోయిన దళాలను కలిగిన పాక్.. ఏం చెప్పినా పట్టించుకోమని షేక్ హసీనా అన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక బంధాలు కొనసాగుతాయని తెలిపారు. భారత్ - పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.
చోటు లేకుండా సార్క్
తమ గడ్డ మీద ఉగ్రవాద కార్యకలాపాలకు చోటు లేకుండా సార్క్ సభ్య దేశాలు జాగ్రత్తపడాలంటూ పరోక్షంగా పాకిస్థాన్కు నేపాల్ సూచన చేసింది. వచ్చే నెల 9, 10వ తేదీల్లో ఇస్లామాబాద్లో సార్క్ సదస్సు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు నేపాల్ అధ్యక్షత వహించాల్సి ఉంది. ఉరీ దాడుల నేపథ్యంలో తాము సదస్సుకు హాజరుకాబోమని భారత్ ప్రకటించగా, మిగతా సభ్య దేశాలు కూడా అదే బాటలో నడిచాయి. దీంతో పాక్ ఏకాకి అయింది. సదస్సు వాయిదాపడింది. ఈ సందర్భంగా నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. సార్క్ వాయిదా పడినందుకు నేపాల్ క్షమాపణ కోరింది.
పాకిస్థాన్
ఇస్లామాబాద్లో సార్క్ సదస్సు రద్దు నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం తక్షణం ఆత్మావలోకనం చేసుకోవాలని ఆదేశ వార్తాపత్రిక ఒకటి పిలుపునిచ్చింది. అంతర్జాతీయ సమాజానికి దేశ వాణిని వినిపించేందుకుగాను ప్రభావవంతమైన విదేశాంగ విధానం అవసరమని కూడా సూచించింది. యూరి ఘటన తదనంతర పరిస్థితులు, సార్క్ సదస్సు రద్దు వంటి ఘటనల నేపథ్యంలో 'ది డైలీ టైమ్స్' ఈ మేరకు ఆదివారం సంపాదకీయాన్ని ప్రచురించింది.
కూరుకుపోయిన
కూరుకుపోయిన