ముస్లింలు చొరబడే ఛాన్స్? భారత సరిహద్దు వెంబడి ఫోన్ సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్
భారత సరిహద్దు వెంబడి కి.మీ దూరం వరకు ఫోన్ కాల్ సర్వీసులను నిలిపివేయాల్సిందిగా బంగ్లాదేశ్ టెలికాం రెగ్యులేటర్ అక్కడి టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి నోటీసులు వచ్చేంతవరకు సర్వీసులను పునరుద్దరించవద్దని స్పష్టం చేసింది. భారత్లో ఎన్ఆర్సీ,సీఏఏ ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ భద్రతా రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అంతేకాదు, భారత్లోని ముస్లింలు బంగ్లాదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది.
సీఏఏ ఎఫెక్ట్:
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)లో పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్,బంగ్లాదేశ్ల నుంచి వలసొచ్చిన క్రైస్తవులు,హిందువులు,సిక్కులు,పార్శీ,బౌద్ద మతస్తులకు స్థానం కల్పించిన ప్రభుత్వం ముస్లింలను మాత్రం మినహాయించిన సంగతి తెలిసిందే. ఆ మూడు దేశాల్లో వివక్ష,హింస కారణంగా అక్కడి నుంచి భారత్కు వలసొచ్చి స్థిరపడ్డ మైనారిటీ శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పిస్తామని ప్రభుత్వం చట్టంలో పొందుపరిచింది. దీని ఉద్దేశం దేశంలో అక్రమంగా స్థిరపడ్డ ముస్లింలను బయటకు పంపించివేయడానికే అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
జాబితా పంపించమన్న బంగ్లా ప్రభుత్వం :
భారత్లో అక్రమంగా స్థిరపడ్డ తమవాళ్లెవరైనా ఉంటే.. ఆ జాబితాను తమకు పంపించాలని, వారిని తిరిగి తమ దేశానికి స్వాగతిస్తామని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబ్దుల్ మొమెన్ ఇటీవలే విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ దేశం కాని వారు కూడా బంగ్లాదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అనుమానిస్తున్న బంగ్లాదేశ్.. సరిహద్దు వెంబడి అవసరమైన చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగానే ఫోన్ సర్వీసులను నిలిపివేసింది.
అక్కడి ముస్లింలు వెళ్లాలనుకుంటే చాలా దేశాలు :
పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్,బంగ్లాదేశ్ల నుంచి వలసొచ్చే మైనారిటీలు ఆశ్రయం పొందడానికి భారత్ తప్ప మరో మార్గం లేదని ఇటీవలే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ,గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు. అదే అక్కడి ముస్లింలు వలస వెళ్లాలనుకుంటే ప్రపంచవ్యాప్తంగా 150 ఇస్లాం దేశాలు ఉన్నాయని వారు వ్యాఖ్యానించారు.
ఎన్ఆర్సీ,సీఏఏలను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు :
కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత రాష్ట్రాలు తిరస్కరించడం సాధ్యపడుతుందా పడదన్న అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. కేంద్రం నిర్ణయాలను రాష్ట్రాలు అమలుచేయకపోతే రాజ్యాంగం సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు,రాజ్యాంగ ఉల్లంఘన కింద స్థానిక ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు.కాగా,
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,కేరళ సీఎం పినరయి విజయన్,పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్,ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తమ రాష్ట్రాల్లో సీఏఏని అమలుచేయమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్రం ఎన్పీఆర్ను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఎన్పీఆర్,ఎన్ఆర్సీకి దొడ్డిదారి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.