30 గంటలు..35 మంది వైద్యులు: అవిభక్త కవలలను వేరు చేసిన హంగేరీ డాక్టర్లు
ఢాకా: అవిభక్త కవలలు అనగానే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు టక్కున గుర్తుకొచ్చేవారు వీణా - వాణీలు. వారినీ ఇప్పటికీ వేరుచేయలేదు. బంగ్లాదేశ్కు చెందిన అవిభక్త కవలలను శస్త్ర చికిత్స చేసి విజయవంతంగా వేరు చేశారు హంగేరీకి చెందిన వైద్యులు. 30 గంటల పాటు నిర్విరామంగా శ్రమించి ఆపరేషన్ చేసి ఇద్దరి తలలను, మెదళ్లను వేరు చేశారు వైద్యులు.
రబేయా-రుకయా అనే మూడేళ్ల అవిభక్త కవలలను శస్త్ర చికిత్స చేసి వైద్యులు వేరుచేశారు. ప్రతి ఐదు నుంచి ఆరు మిలియన్ మందిలో ఒకరికి పుట్టుకతో వచ్చే అతి అరుదైన రుగ్మత ఈ చిన్నారులకు వచ్చింది. అయితే శస్త్రచికిత్స నిర్వహించిన తర్వాత ఇద్దరి పిల్లల ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఇద్దరు చిన్నారులను వేరుచేసేందుకు సర్జరీలో దాదాపు 35 మంది వైద్యులు పాల్గొన్నారు. శస్త్ర చికిత్స కంటే ముందు తల్లిదండ్రుల నుంచి వైద్యులు అనుమతి తీసుకున్నారు. అంటే ఆపరేషన్ చేసినప్పటికీ పిల్లలు బతికే అవకాశం 50శాతం మాత్రమే ఉన్నాయని వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆపరేషన్తో ముందుకు వెళుతామని వైద్యులు చిన్నారుల తల్లిదండ్రులకు తెలిపారు. భారం భగవంతుడిపై వేసి తమ పిల్లలను వేరు చేయాలంటూ వైద్యులకు తెలిపారు రబేయా-రుకయా తల్లిదండ్రులు.