న్యూయార్క్ లో ఇద్దరు మతగురువులు కాల్చివేత
న్యూయార్క్: పట్టపగలు నడిరోడ్డు మీద ఇద్దరు ముస్లీం మతగురువులను కాల్చి వేసిన ఘటన అమెరికాలో కలకకలం రేపింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం ఇద్దరు హత్యకు గురైనారు.
క్వీన్ ప్రాంతంలోని ఓజోన్ పార్క్ సమీపంలో గల అల్ ఫుర్జాన్ జమే మసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వెలుతున్న మతగురువు ఇమాం మౌలామా అంకోజీ (55), ఆయన సహాయకుడు తరాఉద్దీన్ (64)లపై దుండగులు కాల్పులు జరిపారు.
గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన ఈ కాల్పుల్లో వారి ఇద్దరి తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో మౌలామా అంకోజీ సంఘటనా స్థలంలో దుర్మరణం చెందాడు.
తీవ్రగాయాలైన తరాఉద్దీన్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. చికిత్స విఫలమై ఆయన మరణించాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో ఇద్దరూ ఇస్లాం సంప్రదాయ దుస్తులు వేసుకున్నారు.
బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు మతగురువులు హత్యకు గురి కావడంతో న్యూయార్క్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది మత విద్వేష హత్యలా ? కాదా? అని ఇప్పుడే చెప్పలేమని పోలీసులు అన్నారు.
హత్య చేసిన దుండగుల కోసం గాలిస్తున్నామని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్ కు చెందిన ఇమాం మౌలామా అంకోజీ గత రెండుళ్ల నుంచి న్యూయార్క్ లోని అల్ ఫర్జాన్ మసీదులో ఇమాంగా పని చేస్తున్నాడు.
మత గురువు, ఆయన సహాయకుడు హత్యకు గురి కావడంతో క్వీన్స్ ప్రాంతంలోని ముస్లీం సోదరులు ఉలిక్కిపడ్డారు. వందలాధి మంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు.
వెంటనే హంతకులను అరెస్టు చెయ్యాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ముస్లీంల పట్ల చేస్తున్న విద్వేష వ్యాఖ్యల వల్ల ఇలాంటి హత్యలు జరుగుతున్నాయని ఆందోళనకారులు ఆరోపించారు.