వారు రాత్రి హ్యాపీగా, నావి నావే: ఓడినా తగ్గని ఒబామా!
వాషింగ్టన్: మధ్యంతర ఎన్నికల్లో తన పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసినా తన విధానాలను ఏమాత్రం మార్చుకోబోమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంకేతాలిచ్చారు. అయితే, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీతో కలిసి పని చేస్తానని గురువారం ఆయన పేర్కొన్నారు.
తాను ప్రవేశపెట్టిన ఇమ్మిగ్రేషన్ సంస్కరణల వంటివాటికి కాంగ్రెస్ ఆమోదం లభించాల్సి ఉందన్నారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన 11 మిలియన్ల మంది అమెరికాలోనే ఉండిపోవటానికి ఈ ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు వీలు కల్పిస్తున్నాయి. వీరిలో భారత్కు చెందిన వారు 2.4 లక్షలమంది ఉన్నారు.
మంగళవారం నాటి ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నాటకీయంగా ఘోర పరాజయం పాలయిన తరువాత ఒబామా మొదటిసారి మీడియా సమావేశంలో మాట్లాడారు. తన అజెండాలో మార్పులు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తరువాత రిపబ్లికన్లు శుభరాత్రిని గడిపారని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు.
అయితే రిపబ్లికన్ల చేతిలో డెమోక్రటిక్ పార్టీకి ఎదురైన ఘోర పరాజయానికి ప్రత్యక్ష బాధ్యత వహించేందుకు ఒబామా ముందుకు రాలేదు. అమెరికాకు మంచి భవిష్యత్తు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ భూప్రపంచం మీద మరే దేశంతో పోల్చినా అమెరికాకే మంచి రోజులు ఉన్నాయన్నారు.
అమెరికా భవిష్యత్తుపై తాను ఆశావాద దృక్పథంతో ఉన్నానన్నారు. తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత అమెరికా వాస్తవిక పురోగతి సాధించిందని ఒబామా అన్నారు. అమెరికాలో ఎక్కువమంది ఉద్యోగాలు చేస్తున్నారని, నిరుద్యోగ సమస్య తగ్గిందని చెప్పారు.
గతంలో కన్నా మరింత మంది అమెరికన్లకు ఆరోగ్య బీమా సౌకర్యం లభించిందని తెలిపారు. మాన్యుఫాక్చరింగ్ రంగం కూడా వృద్ధి చెందిందని పేర్కొన్నారు. విదేశీ చమురు మీద అమెరికా ఆధారపడడం తగ్గిందని తెలిపారు. జాతీయ అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్పై నియంత్రణ సాధించిన రిపబ్లికన్లతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఒబామా తెలిపారు.
ఉద్యోగాల సృష్టి, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి తాను ప్రాధాన్యం ఇస్తామని రిపబ్లికన్ పార్టీ నాయకత్వం పేర్కొంది. ఒబామా కేర్ను రద్దు చేసే దిశగా చర్యలు చేపడతామని అది ఉద్యోగాల పైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ప్రతినిధుల సభ జాన్ బోహ్నెర్, సెనెట్ మెజార్టీ నేత మిచ్ మెక్ కానెల్ చెప్పారు.