బూతులు తిట్టినా!: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిని కలిసిన ఒబామా
వియన్టైన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో తీవ్రమైన పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసి క్షమాపణలు కోరారు. ఈ నేపథ్యంలో రోడ్రిగో డ్యుటెర్ట్ను కలిశారు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.
ఇద్దరు నేతలు కొంతసేపు మాట్లాడుకున్నట్లు ఫిలిప్పైన్స్ విదేశాంగ కార్యదర్శి పర్ఫెక్టో యాసే వెల్లడించారు. లావోస్లో జరుగుతున్న ఏషియాన్ సమావేశంలో అన్ని దేశాల నేతల విందు కార్యక్రమానికి ముందు ఈ సమావేశం జరిగినట్లు ఆయన చెప్పారు.
డిన్నర్కు ముందు వెయిటింగ్ రూమ్లో వాళ్లు కలిశారని, ఆ రూమ్ నుంచి వారే చివరిగా బయటకు వచ్చారని తెలిపారు. అయితే ఇద్దరి మధ్య ఎంతసేపు చర్చ జరిగిందన్నదని తనకు తెలియదని పర్ఫెక్టో అన్నారు. ఇద్దరు నేతలు కలవడం తనకు సంతోషం కలిగించిందని చెప్పారు.
ఒబామాను తిట్టిపోసిన రోడ్రిగో: ఫిలిప్పీన్స్ పర్యటన రద్దు
అటు వైట్హౌజ్ వర్గాలు కూడా ఇద్దరు నేతల మధ్య కాసేపు చర్చ జరిగిందని ఓ ప్రకటనలో వెల్లడించాయి. అయితే అది కేవలం యోగక్షేమాలు కనుక్కోవడానికే పరిమితమైందని తెలిపాయి.
కాగా, ఫిలిప్పీన్స్లో డ్రగ్స్ మాఫియా అణచివేత పేరుతో జరుగుతున్న మారణహోమాన్ని తీవ్రంగా ఖండించిన ఒబామా.. దీనిపై డ్యుటెర్ట్ని నిలదీస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తీవ్రంగా స్పందించిన డ్యుటెర్ట్.. ఒబామాను తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో ఇద్దరి మధ్య మంగళవారం జరగాల్సిన సమావేశాన్ని ఒబామా రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పడంతో ఇప్పుడు భేటీ అయ్యారు.