పాకిస్తాన్ ఆర్మీ పైశాచికం.. ఉగ్రవాదుల మాటున పాక్ సైన్యం దుశ్చర్యలు, బలైపోతున్న భారత జవాన్లు
పాక్ ఆర్మీ ఇద్దరు భారత జవాన్లను కాల్చి చంపడమే కాక.. అత్యంత కిరాతకంగా వారి శరీరాలను ముక్కలు ముక్కలు చేసిన ఘటనపై భారత సైన్యం భగ్గుమంటోంది. తాజా ఘటనతో భారత, పాక్ నడుమ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
జమ్మూ కశ్మీర్: పాక్ ఆర్మీ ఇద్దరు భారత జవాన్లను కాల్చి చంపడమే కాక.. అత్యంత కిరాతకంగా వారి శరీరాలను ముక్కలు ముక్కలు చేసిన ఘటనపై భారత సైన్యం భగ్గుమంటోంది. తాజా ఘటనతో భారత, పాక్ నడుమ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
పాక్ సైన్యం నీచమైన చర్యకు తగిన సమాధానం ఇస్తామని భారత సైన్యం ఇప్పటికే ప్రకటించింది. గూఢచర్యం ఆరోపణలపై భారతీయుడైన కుల్భూషణ్ జాదవ్కు ఉరిశిక్ష విధించడం.. తాజాగా ఇద్దరు భారత జవాన్లను దారుణంగా హతమార్చడంతో భారత సైన్యం ఉడికిపోతోంది.
అసలేం జరిగిందంటే...
జమ్మూకశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో.. పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సైన్యంపై కాల్పులకు దిగింది. అప్రమత్తమైన భారత జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు.
ఒక వైపు కాల్పులు.. మరో వైపు...
ఒక వైపు కాల్పులు జరుగుతుండగానే మరోవైపు పాకిస్థాన్కు చెందిన బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ) సభ్యులు 250 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చారు. ఈ బోర్డర్ యాక్షన్ టీంలో పాక్ సైనికులతోపాటు కొంతమంది ఉగ్రవాదులు కూడా సభ్యులుగా ఉంటారు.
మోర్టార్లతో కాల్పులకు తెగబడి...
బీఏటీ సభ్యులు భారత భూభాగంలోకి చొరబడిన సమయంలో కృష్ణా ఘాటి సెక్టార్లోని బోర్డర్ పోస్టుల్లో 22 సిక్కు బెటాలియన్కు చెందిన తొమ్మిది మంది బృందం విధులు నిర్వహిస్తోంది. వీరిపై బీఏటీకి చెందిన ముష్కరులు మోర్టార్లతో పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడ్డారు.
మృతదేహాలను ముక్కలుగా చేసి...
పాకిస్తాన్ ముష్కరులు జరిపిన ఈ కాల్పుల్లో భారత సైన్యానికి చెందిన నాయిబ్ సుబేదార్ పరంజీత సింగ్, బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ మృతి చెందారు. వారి దేహాలను పాక్ ముష్కరులు ముక్కలు ముక్కలు చేసి తమ కసి తీర్చుకున్నారు. అనంతరం పాక్ బీఏటీ సభ్యులు వెనక్కి వెళ్లిపోయారు.
నెల రోజుల వ్యవధిలో.. ఏడుసార్లు...
ఈ ఘటనలో మరో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ రాజిందర్ సింగ్ కూడా గాయపడ్డారు. తాజా ఘటనతో భారత, పాక్ నడుమ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గత రెండేళ్లుగా పాకిస్థాన్ పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వచ్చింది. నెల రోజుల వ్యవధిలో పూంచ్, రాజౌరి సెక్టార్లలో పాక్ ఏడుసార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది.
‘ఉల్లంఘన' పాక్ సైనికులకు మామూలే...
నియంత్రణ రేఖను దాటడం.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నేరుగా భారత ఆర్మీ పోస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు జరపడం పాక్ ఆర్మీ తరచూ చేసే పనే. ఉదాహరణకు.. గత నెల(ఏప్రిల్)లో పాక్ దళాలు పూంఛ్, రాజౌరీ సెక్టార్లలో ఏడుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి.
‘ముక్కలు' చేయడం మూడోసారి...
పాక్ ఆర్మీ మన సైనికుల మృతదేహాలను ముక్కలు చేయడం గత ఆరు నెలల్లో ఇది మూడోసారి. గత ఏడాది కూడా అక్టోబరు, నవంబరు నెలల్లో నియంత్రణ రేఖ వెంబడి మాచిల్ ప్రాంతంలో ఈ ఘటనలు జరిగాయి. అప్పుడు కూడా పాక్ సైనికులు ఇద్దరు భారత సైనికుల తలలను తెగనరికారు.
పక్కా వ్యూహంతో.. తప్పుడు సమాచారం చేరవేసి..
పాక్ సైన్యం ముందస్తు వ్యూహంతోనే భారత సైనికులపై ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. నియంత్రణ రేఖ వెంబడి ఏర్పాటు చేసిన మందుపాతరలను పేల్చి వేయడం ద్వారా భారత సైనికులను హతమార్చేందుకు పాక్ సిద్ధమవుతోందన్న తప్పుడు సమాచారాన్ని భారత సైన్యానికి చేరవేసింది.
తనిఖీ చేస్తుండగా.. అదను చూసి..
దీంతో అప్రమత్తమైన భారత సైన్యం మందుపాతరలను గుర్తించి, తొలగించేందుకు ఎల్వోసీ వెంబడి తనిఖీలు ప్రారంభించింది. అప్పటికే పాక్ బీఏటీ సభ్యులు భారత భూ భాగంలోకి 250 మీటర్ల మేర చొరబడి, అదను కోసం మాటు వేసి ఉన్నారు. తనిఖీల కోసం భారత జవాన్లు రాగానే వారిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా హతమార్చారు.
‘‘పాకిస్తాన్ సైన్యం అండ చూసుకునే..''
‘పక్కా వ్యూహంతోనే పాక్ సైన్యం దాడికి పాల్పడింది. కాల్పులు జరుపుతూ భారత సైన్యం దృష్టి మరల్చి బీఏటీ సభ్యులు భారత భూభాగంలోకి 250 మీటర్ల మేర చొరబడేందుకు పాక్ సైన్యం సహకరించింది.' అని భారత సైన్యానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
‘‘ఆ ఇద్దరు మాత్రం వెనుకబడి...''
గస్తీ బృందం సభ్యులను లక్ష్యంగా చేసుకొనే పాక్ బోర్డర్ యాక్షన్ టీం దాడికి పాల్పడగానే భారత జవాన్లు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని, అయితే ఇద్దరు జవాన్లు మాత్రం వెనుకబడిపోయారని, చివరికి పాక్ ముష్కరుల దాడికి బలైపోయారని ఆ అధికారి వివరించారు.