ఇంట్రెస్టింగ్ : కోవిడ్-19 నుంచి ఈ వ్యాధికిచ్చే వ్యాక్సిన్ కాపాడుతుంది: కొత్త స్టడీ
న్యూయార్క్ : ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 48వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. అంతేకాదు కొన్ని లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైంది. ఈ క్రమంలోనే ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ ఒకటి వెలుగులోకి వచ్చింది. క్షయ వ్యాధికి వ్యాక్సిన్ తప్పనిసరి అనే విధానాన్ని పాటిస్తున్న దేశాలకు సంబంధించి ఈ స్టడీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ను బయటపెట్టింది. ఇంతకీ ఈ వాస్తవం ఏంటి..?
క్షయవ్యాధికి వ్యాక్సిన్ ఇచ్చే దేశాల్లో తక్కువగా కరోనా కేసులు
కరోనావైరస్ ప్రపంచదేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఒకేసారి 192 దేశాలను గడగడలాడిస్తోంది. అయితే క్షయవ్యాధికి వ్యాక్సిన్ తప్పనిసరిగా ఉండాలన్న విధానంతో ముందుకెళుతున్న దేశాల్లో కరోనావైరస్ మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కొత్త స్టడీ పేర్కొంది. అంటే క్షయ వ్యాధి పూర్తిగా నిర్మూలించామని చెబుతూ వ్యాక్సిన్లకు ప్రాధాన్యత ఇవ్వని దేశాల్లో కరోనావైరస్ మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని ఆ స్టడీ వెల్లడించింది. ఇక బీసీజీ వ్యాక్సిన్ తప్పనిసరిగా పాటిస్తున్న ఆరు దేశాలు కరోనావైరస్పై పోరాడుతున్న తమ హెల్త్ వర్కర్లకు , వృద్ధులకు ఈ వ్యాక్సిన్ ఇచ్చి వారిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
బీసీజీ కచ్చితంగా అమలు చేయని దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువే..
జపాన్లో అత్యంత తక్కువ కేసులు నమోదు కావడం చూశాక న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న గోంజాలో ఒటాజు దీనిపై విశ్లేషణ చేశారు. చైనా తర్వాత జపాన్లో కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే అప్పుడే జపాన్ దేశం లాక్డౌన్ ప్రకటించింది. ఇక బీసీజీ వ్యాక్సిన్ ఒక్క క్షయవ్యాధికే వ్యాక్సిన్లా పనిచేయదని ఇతర బ్యాక్టీరియాలను నియంత్రించడంలో సైతం పనిచేస్తుందన్న విషయాన్ని తాను తెలుసుకున్నట్లు ఒటాజు చెప్పారు. వెంటనే తమ బృందం బీసీజీ వ్యాక్సిన్ కచ్చితంగా అమలు చేస్తున్న దేశాల జాబితాను సిద్దం చేసి అక్కడ కరోనా కేసులను విశ్లేషించడం మొదలు పెట్టినట్లు ఒటాజు చెప్పారు. ఆ తర్వాత బీసీజీని అమలు చేయని దేశాల్లో మరణాల సంఖ్య, అమలు చేస్తున్న దేశాల్లో రికార్డ్ అయిన మరణాల సంఖ్యను పోల్చి చూడటం జరిగిందని వెల్లడించారు.
ఆదేశాల్లో పరిస్థితి ఎలా ఉందంటే...
అత్యధిక ఆదాయం ఉన్న దేశాలైన అమెరికా ఇటలీలో కోవిడ్-19 కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు. ఈ రెండు దేశాలు బీసీజీ వ్యాక్సిన్ సూచిస్తున్నాయని అయితే ఇది ప్రాణహాని ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే ఇస్తున్నాయని తాము గ్రహించినట్లు ఒటాజు చెప్పారు. అదే జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, యూకే దేశాల్లో బీసీజీ పాలసీ ఒకప్పుడు ఉండేదని కొన్ని దశాబ్దాల క్రితమే దీనికి స్వస్తి పలికినట్లు ఒటాజు చెప్పారు. ఈ కరోనావైరస్ మహమ్మారి పుట్టిన చైనాలో బీసీజీ వ్యాక్సిన్ పాలసీ ఉండేదని అయితే 1976కు ముందు ఇది అంతగా వాడుకలో ఉండేది కాదని చెప్పారు. ఇదిలా ఉంటే జపాన్, దక్షిణ కొరియాలో కరోనావైరస్ను నియంత్రించగలిగాయని ఇందుకు కారణం అక్కడ బీసీజీ వ్యాక్సిన్ పాలసీ అమల్లో ఉందని ఒటాజు చెప్పారు.
Recommended Video
ఫైనల్గా సామాజిక దూరం పాటించాల్సిందే..
ఇదిలా ఉంటే కోవిడ్-19కు వ్యాక్సిన్ కనుగొనేందుకు ఎంతలేదన్నా ఒక ఏడాది సమయం పట్టే అవకాశాలున్నాయని, అప్పటి వరకు ఎంత నష్టం జరుగుతుందో ఊహించలేమన్నారు ఒటాజు. అయితే అప్పటి వరకు బీసీజీ వ్యాక్సిన్ ఏమేరకు ప్రభావితం చూపగలదో టెస్టింగ్ చేయాలని సూచించారు. ఒటాజు ప్రతిపాదనతో ఏకీభవించారు యూనివర్శిటీ ఆఫ్ టొరొంటో ప్రొఫెసర్ ఇలియానర్ ఫిష్. పూర్తిగా బీసీజీతోనే నయం అవుతుందని తాను చెప్పలేనని కచ్చితంగా వ్యక్తిగత శుభ్రత పాటించడంతోపాటు సామాజిక దూరం కూడా పాటిస్తేనే కోవిడ్-19 నుంచి విముక్తి పొందగలమని ఒటాజు చెప్పారు.