పోలీసులకు మతిపోయింది: బిచ్చగాడి వద్ద 48 లక్షలు
దుబాయ్: దుబాయ్లో అడుక్కోవడం నేరం. అలాంటి దేశంలో ఓ బిచ్చగాడి వద్ద దాదాపు రూ. 48 లక్షలు లభించడంతో పోలీసులు మతిపోయింది. వివరాల్లోకి వెళితే.... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో చట్టాలను చాలా కఠినంగా అమలు చేస్తారు. ప్రధాన వీధులు, ప్రార్దనా స్ధలాల్లో ఎవరైనా అడుక్కున్నట్లు కనిపిస్తే పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటారు.
అయితే పోలీసులు కళ్లుగప్పి ఇంకా ఎంతోమంది యాచకత్వాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. అలాంటి వాళ్లను పట్టుకునేందుకు పోలీస్ శాఖతో కలిసి దుబాయ్ మున్సిపల్ శాఖ ఈ ఏడాది ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించింది. పోలీసు శాఖ నిర్వహించి ఈ ప్రత్యేక డ్రైవ్లో ఇప్పటివరకు మొత్తం 59 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల వివరాలు, వస్తువులను పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులకు ఒక యాచకుడి దగ్గర ఉన్న డబ్బుని చూసి వారికి మతి పోయింది.
'మేం పట్టుకున్న యాచకుల్లో ఒకరి దగ్గర 270,000 దినార్లు (రూ.48 లక్షలు) లభించాయి. ఇది చాలా పెద్ద మొత్తం. స్వల్పకాలిక వీసా, వర్కింగ్ లేదా బిజినెస్ వీసాల మీద దుబాయ్కి వచ్చే కొందరు ఇక్కడ బెగ్గింగ్ను వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఇలా దుబాయ్లో ఓ యాచకుడి రోజు వారీ సంపాదన 9,000 దినార్లు.' అని దుబాయ్ మున్సిపల్ అధికారి ఫైజల్ అల్ బదియావి తెలిపారు.
గతేడాది రంజాన్ పండుగ నాడు మసీదుల ముందు అడుక్కుంటున్న 197 మంది యాచకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వచ్చే రంజాన్ పండుగలోగా నగరంలో యాచకులు లేకుండా చేయాలన్నది తమ లక్ష్యమని ఫైజల్ చెప్పారు. యాచకులతో దేశ ప్రతిష్ట దిగజారుతుందని, ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా సాకుగా మారిందని అందుకే ఆ వృత్తిని యూఏఈలో నిషేధించామన్నారు.