చైనా సంచలనం: 1200లకు పైగా విమాన సర్వీసులు రద్దు: అనూహ్యంగా..బీజింగ్లో భారీగా
బీజింగ్: చైనా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రాజధాని బీజింగ్లోని విమానాశ్రయాన్ని పాక్షికంగా మూసివేత దిశగా చర్యలు తీసుకుంటోంది. బీజింగ్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన 1200లకు పైగా విమాన సర్వీసులను ఉన్నఫళంగా రద్దు చేసింది. అక్కడితో ఆగలేదు డ్రాగన్ కంట్రీ. బీజింగ్ పరిధిలోని అన్ని కళాశాలలను మూసివేసింది. ఈ మేరకు రాత్రికి రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి ప్రధాన కారణం.. మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదు కావడమే.
భారత జవాన్లు పులులు..అనవసరంగా కెలికారు: అమెరికా మీడియా: నిశితంగా పరిశీలిస్తోన్న వైట్హౌస్
బీజింగ్లో ఉధృతం
కొద్దిరోజులుగా చైనాలో కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వరుసగా నమోదు అవుతున్నాయి. ప్రత్యేకించి రాజధాని బీజింగ్లో దీని తీవ్రత అధికంగా ఉంటోంది. ఇటీవలే ఒకేరోజు 57 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అక్కడ నమోదు అయ్యాయి. ఆ తరువాత కూడా కొత్త కేసులు నమోదు అయ్యాయి. చైనా దక్షిణ ప్రాంతంలోని ఓ మాంసం, కూరగాయల మార్కెట్ నుంచి కరోనా విస్తరించినట్లు బీజింగ్ స్థానిక పరిపాలన అధికారులు గుర్తించారు. వెంటనే- దాన్ని మూసివేశారు. మార్కెట్ చుట్టుపక్కల ఉన్న 11 ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు.
సెకెండ్ వేవ్ తరహా
అయినప్పటికీ.. కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి అదుపులోకి రాలేదు. మరోసారి భారీగా కేసులు నమోదు అయ్యాయి. బీజింగ్ మెట్రోపోలిస్ పరిధిలో 24 గంటల వ్యవధిలో 31 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా మరోసారి కట్టుదిట్టంగా లాక్డౌన్ను అమలు చేయడానికి బీజింగ్ స్థానిక అధికారులు నిర్ణయం తీసుకున్నారు. బీజింగ్లో సెకెండ్ వేవ్ తరహా పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రభుత్వానికి నివేదికలను పంపించారు.
పాక్షికంగా లాక్డౌన్..
ఫలితంగా- మరోసారి లాక్డౌన్ తరహా పరిస్థితులను అమల్లోకి తీసుకొచ్చారు. దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఒకవంక కొనసాగిస్తూనే లాక్డౌన్ను కట్టుదిట్టం చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడే ప్రదేశాలను క్రమబద్ధీకరించారు. విమాన సర్వీసులను రద్దు చేశారు. బీజింగ్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన 1255 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బీజింగ్ మెట్రోపోలిస్ పరిధిలో ఉన్న కళాశాలలను మూసివేయాలని ఆదేశాలను జారీ చేశారు.
కంటైన్మెంట్ క్లస్టర్లు పెంపు
కంటైన్మెంట్ రెసిడెన్షియల్ ఏరియాల సంఖ్యను పెంచారు. ఇదివరకు 11 రెసిడెన్షియల్ క్లస్టర్లన కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించగా..దాని సంఖ్యను 31కి పెంచుతూ తాజాగా ఉత్తర్వులను జారీ చేశారు. మీడియం లేదా హైరిస్క్గా గుర్తించిన ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై నిషేధాన్ని విధించారు. ఇతర ప్రావిన్స్ల నుంచి కొత్తగా బీజింగ్కు వచ్చే వారికి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీనికోసం నగరంలోనికి ప్రవేశించిన అన్ని మార్గాల్లో ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
Recommended Video
137కు చేరిన కరోనా కేసులు..
బీజింగ్ సహా రాజధానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కొద్దిరోజుల వ్యవధిలో 137 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని బీజింగ్ మెట్రోపోలిస్ అధికార ప్రతినిధి గ్ఝు హెజియాన్ తెలిపారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. కమ్యూనిటీ వ్యాప్తి లేనప్పటికీ.. భవిష్యత్తులో సంభవించే అవకాశాలు లేకపోలేదని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సామూహికంగా ర్యాండమ్ పరీక్షలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.