సరిహద్దు రేఖ వాస్తవాధీనరేఖపై ఎలాంటి ప్రభావం ఉండదు: చైనాకు జైశంకర్ స్పష్టం
బీజింగ్ : భారత్ చైనాల మధ్య సంబంధాలు ఇరుదేశాల మధ్య ఉన్న అతిసున్నితమైన అంశాలపై ఆధారపడి ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. కొద్దిరోజుల క్రితం భారత రాజ్యాంగంలో చేసిన మార్పులతో భారత సరిహద్దుల విషయంలో అంటే చైనాతో వాస్తవాధీన రేఖ వద్ద ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. అయితే పాకిస్తాన్తో భారత్ సరిహద్దుల్లో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ పై కూడా ప్రభావం ఉండదని చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్ యీతో చెప్పారు. అంతేకాదు భారత్కు న్యాయంగా రావాల్సిన భూభాగాన్ని మాత్రమే తీసుకుంటోందని అంతకు మించి ఏమీ కోరడం లేదని స్పష్టం చేశారు. దీన్నే పాక్ వక్రీకరించి చైనాకు మరోలా తెలిపిందని జైశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని వాంగ్ యీ ప్రస్తావించడంతో అది భారత అంతర్గత వ్యవహారమని జైశంకర్ తెలిపారు.
పాక్ పాచికలు పారలేదు
జమ్ము కశ్మీర్ను విభజించడం, అక్కడ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ కడుపు మండి భారత్ను ప్రపంచ దేశాల ముందు దోషిని చేయాలని భావించింది. అయితే పాక్ పాచికలు పారలేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్దే అని అమిత్షా ప్రకటించడంతో పాటు చైనా ఆక్రమిత అక్సయ్చిన్ కూడా భారత్ తీసుకొస్తుందని చెప్పిన నేపథ్యంలో...తొలిసారిగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ చైనా ఉపాధ్యక్షుడితో భేటీ అయ్యారు. జమ్మూ కశ్మీర్పై చోటుచేసుకున్న పరిణామాలపై రెండు దేశాలు చర్చించాయి. అయతే జమ్మూ కశ్మీర్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు డ్రాగన్ కంట్రీ వెల్లడించింది. సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు రెండు దేశాలు ప్రయత్నించాలని చైనా కోరింది. మరోవైపు ద్వైపాక్షిక చర్చల సందర్భంగా తలెత్తిన విబేధాలు వివాదాలుగా మారకూడదని భారత్ ఆకాంక్షించింది.
ప్రపంచ రాజకీయాల్లో భారత్ చైనాలకు ప్రత్యేక స్థానం
ముందుగా చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్. అనంతనం ప్రసంగించిన ఆయన భారత్ చైనాల బంధం ప్రపంచ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉందని అన్నారు. రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు అస్తానాలో కలిసిన సమయంలో ప్రపంచదేశాల్లో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు భారత్ చైనా దేశాలు ఒక్క తాటిపై నిలవాలని నిర్ణయించుకున్నాయని గుర్తుచేశారు. రెండు దేశాల మధ్య ఏవైనా చిన్నపాటి విబేధాలు ఉంటే వాటిని గొడవల వరకు దారి తీసే అవకాశం ఇవ్వకుండా మసులుకుందామని జైశంకర్ పిలుపునిచ్చారు. అనంతరం వూహాన్ సమావేశంలో ఇరు దేశాల నేతలు తమ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను పంచుకున్న విషయాలను జైశంకర్ గుర్తు చేశారు.
శాంతి మంత్రాన్ని పటించాలని ఇరుదేశాలకు చైనా సూచన
ఇదిలా ఉంటే చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్ యీ కూడా ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్ విషయంలో భారత్ పాక్ దేశాలు శాంతిని పాటించాలని కోరారు. సరిహద్దుల్లో ఎలాంటి అలజడి సృష్టించరాదని పిలుపునిచ్చారు. భారత్ పాక్ల మధ్య నెలకొనే విబేధాలను చైనా చాలా దగ్గరగా పరిశీలిస్తుందని వాంగ్ యీ చెప్పారు. శాంతిని నెలకొల్పేందుకు భారత్ నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుందన్న ఆశాభావం వాంగ్ వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే చైనాతో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు పాకిస్తాన్ ఎప్పుడో తన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మహ్మూద్ ఖురేషీని బీజింగ్కు పంపింది.
జమ్మూ కశ్మీర్ పై భారత్ తన నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత చైనా రెండు ప్రకటనలు చేసింది. మొదటిది లడఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంపై నిరసన తెలిపింది డ్రాగన్ కంట్రీ. రెండోది కశ్మీర్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని చైనా కోరుకుంటోందంటూ ప్రకటన విడుదల చేసింది. హింసాత్మక ఘటనలకు తావులేకుండా రెండు దేశాలు శాంతి మంత్రం పటించాలని అందుకు రెండు దేశాలు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలంటూ ప్రకటనలో పేర్కొంది.