జర్నలిస్టుల బహిష్కరణ: ఇండియాకు చైనా మీడియా బెదరింపు
న్యూఢిల్లీ/బీజింగ్: తమ దేశం నుంచి చైనాకు చెందిన ముగ్గురు జర్నలిస్టులను బహిష్కరించాలన్న భారత్ నిర్ణయంపై చైనా మీడియా బెదిరింపులకు దిగింది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ) లో సభ్యత్వానికి చైనా మద్దతు పలుకలేదన్న కక్షతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే.. ఇందుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనా ప్రభుత్వ మీడియా హెచ్చరించింది.
భారతీయులకు తమ దేశ వీసాలు ఇవ్వడం చైనా మరింత కష్టతరం చేసే అవకాశముందని తెలిపింది. దీనివల్ల చైనాలో ఉంటున్న భారత జర్నలిస్టులపై ప్రభావం పడుతుందని కూడా వ్యాఖ్యానించింది.
చైనా వార్తాసంస్థ జిన్హుహాకు చెందిన ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఆ ముగ్గురు జర్నలిస్టుల కదలికలపై నిఘా ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, ఎన్ఎస్జీ సభ్యత్వం విషయంలో తమకు మద్దతు ఇవ్వకపోవడంపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇందుకు తీవ్ర పరిణామాలు తప్పవని చైనా జాతీయ టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్ ఆదివారం హెచ్చరించింది.
హద్దులు దాటినందుకే బహిష్కరణ: భారత్
చైనా అధికార వార్తా సంస్థ జిన్హువాకు చెందిన ముగ్గురు జర్నలిస్టులను భారత్లో ఉండటానికి అనుమతి నిరాకరించడానికి కారణం వారు అధికారిక విధులను మీరి కార్యకలాపాలను చేపట్టడమేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆ వార్తా సంస్థకు చెందిన ఢిల్లీ బ్యూరో అధిపతి వు క్వియాంగ్, ముంబై జర్నలిస్టులు టాంగ్లు, మా క్వియాంగ్లను భద్రతా సంస్థలు కొన్ని నెలలుగా పరిశీలిస్తున్నాయని తెలిపాయి. వారి వీసాల గడువు జనవరిలో ముగిసింది.
అప్పటినుంచి వాటిని పొడిగిస్తూ వచ్చారు. తాజాగా మరో పొడిగింపు ఇవ్వకపోవడం వల్ల జులై 31 కల్లా వారు భారత్ను వీడాల్సి ఉంటుంది. ఈ ముగ్గురి స్థానంలో వేరేవారిని పంపే స్వేచ్ఛ చైనాకు ఉందని ఆవర్గాలు తెలిపాయి. అణుసరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్కు సభ్యత్వం రాకుండా చైనా అడ్డుకోవడానికి ఈఘటనతో సంబంధం లేదని స్పష్టం చేశాయి.