బీరుట్ పేలుడు : ఎక్కడ చూసినా భీతావహ దృశ్యాలు- 78 మంది మృతి- 4వేలకు పైగా బాధితులు..
లెబనాన్ రాజధాని బీరుట్ లో నిన్న రాత్రి చోటు చేసుకున్న భారీ విస్ఫోటం వందలాది మంది జీవితాలను చిదిమేసింది. వేలాది మందిని క్షతగాత్రులుగా మార్చింది. పేలుడు తీవ్రత 240 కిలోమీటర్ల అవతల ఉన్న సైప్రస్ దీవులకూ వినిపించింది. బీరుట్ లో ప్రస్తుతం పరిస్ధితి అత్యంత భీతావహంగా మారిపోయింది. ఎక్కడ చూసినా తెగిపడిన శరీర భాగాలు, క్షతగాత్రుల రోదనలే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులను పొగొట్టుకున్న ఆవేదనలో ప్రజలు విషాద సంద్రంలో మునిగిపోయారు. లెబనాన్ ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది. పేలుడుకు బాధ్యులు ఎవరైనా వదిలిపెట్టబోమని హెచ్చరించింది.
Recommended Video
చిగురుటాకులా వణికిన బీరుట్...
లెబనాన్ రాజధాని బీరుట్ లోని ఓ వ్యవసాయ ఉత్పత్తుల గోదాములో నిల్వచేసిన అమ్మోనియం నైట్రేట్ పేలడంతో దేశమంతా ఒక్కసారిగా కంపించింది. పేలుడు శబ్దాలు పొరుగున ఉన్న దేశాలు, దీవులకు వినిపించాయి. పేలుడు సమయంలో షూట్ చేసిన వీడియోలు ఒళ్లు గగొర్పొడిచేలా ఉన్నాయి. పేలుడు నుంచి జనం తప్పించుకునే సమయం కూడా ఎవరికీ దక్కలేదు. సెకన్ల వ్యవధిలో చోటు చేసుకున్న భారీ పేలుళ్లలో 78 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజా సమాచారం. దాదాపు 4 వేల మందికి పైగా క్షతగాత్రులుగా మారిపోయారు. ఇప్పుడు బీరుట్ లో ఎక్కడ చూసినా తెగిపడిన శరీర భాగాలు, క్షతగాత్రుల రోదనలే కనిపిస్తున్నాయి. పేలుడు ధాటికి భారీ భవనాలు సైతం కుప్పకూలాయి. ఈ శిధిలాలు తొలగిస్తే కానీ ఎంతమంది చనిపోయారనేది తేలేలా లేదు.
ఆస్పత్రులు కరువు...
బీరుట్ లో భీతావహ పేలుడు తర్వాత క్షతగాత్రులను తరలించి అత్యవసర చికిత్స అందించేందుకు ఆస్పత్రులు సైతం సరిపోని పరిస్ధితి. ఇప్పటికే కరోనా వైరస్ బాధితులకే వైద్య సదుపాయాలు అందించలేని పరిస్ధితిలో లెబనాన్ సమస్యలు ఎదుర్కొంటోంది. కరోనా సహాయక చర్యల కోసం విదేశాల పైన ఆధారపడే పరిస్ధితి లెబనాన్ది. దీంతో ఇప్పుడు పేలుడు బాధితులను ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక ప్రభుత్వం దిక్కులు చూస్తున్న పరిస్దితి చాలా చోట్ల ఉందని వార్తలొస్తున్నాయి.
ఎమర్జెన్సీ ప్రకటన -మూడు రోజుల సంతాపం..
బీరుట్ పేలుడు నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది. అధ్యక్షుడు మైకేల్ ఔన్ అత్యవసర కేబినెట్ భేటీకి పిలుపునిచ్చారు. రెండు వారాల పాటు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. అన్ని అధికారిక కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేసింది. అధ్యక్షుడు, ప్రధాని సహా ప్రముఖులు తమ సాధారణ షెడ్యూల్ ను రద్దు చేసుకున్నారు. బాధితులను ఆదుకునేందుకు తక్షణం 100 బిలియన్ ఇరాలను తక్షణ సాయంగా ప్రభుత్వం విడుదల చేసింది. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని ప్రకటించారు.
ఆరేళ్లుగా దాచిన అమ్మోనియం నైట్రేట్
సెకన్ల వ్యవధిలో కిలోమీటర్ల మేర ప్రభావం చూపిన ఈ పేలుడు వెనుక ఆరేళ్లుగా దాచిన 2750 టన్నుల భారీ అమ్మోనియం నైట్రేట్ నిల్వలే కారణమని లెబనాన్ అధ్యక్షుడు మైకేల్ ఔన్ ప్రకటించారు. ఇంత భారీగా అమ్మోనియం నైట్రేట్ దాచినా గోడౌన్ లో తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ప్రాథమిక విచారణలో తేలిందని అధ్యక్షుడు వెల్లడించారు. పేలుడుకు ఇంతకు మించిన కారణాలు ఏవైనా ఉన్నాయా, పేలుడుకు దారి తీసిన తక్షణ కారణాలేంటన్న దానిపై ప్రస్తుతం అత్యున్నత స్ధాయి విచారణ సాగుతోందని ప్రభుత్వం ప్రకటించింది. దీని వెనుక ఎంతటి వారున్నా భారీ శిక్ష తప్పదని లెబనాన్ సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది.
కుట్ర కోణంపైనా దర్యాప్తు...
ఆరేళ్ల క్రితం విదేశాల నుంచి తెప్పించిన అమ్మోనియం నైట్రేట్ ను బీచ్ పక్కన ఉన్న గోదాములు నిల్వ ఉంచారు. అప్పటి నుంచి దీన్ని వాడకపోగా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. దీంతో ఇది దానికదే ఒత్తిడి ఎక్కువై పేలిందా లేదా గోదాములో షార్ట్ సర్క్యూట్ కానీ మరే ఇతర ప్రమాదం కానీ జరిగిందా అన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు లెబనాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది. కరోనా వైరస్ ఆ దేశాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. 2005లో జరిగిన మాజీ ప్రధాని రఫీక్ హరీరీ హత్యకు సంబంధించిన కీలక తీర్పు ఎల్లుండి వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కారణాలు ఏవైనా కావొచ్చనే వాదన వినిపిస్తోంది.