బెర్లిన్ దాడి మాదే : ఇస్లామిక్ స్టేట్
జర్మనీ రాజధాని బెర్లిన్ లోని క్రిస్మస్ మార్కెట్ లో ట్రక్కు బీభత్సానికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.
బెర్లిన్: జర్మనీ రాజధాని బెర్లిన్ లోని క్రిస్మస్ మార్కెట్ లో ట్రక్కు బీభత్సానికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. సోమవారం రాత్రి క్రిస్మస్ మార్కెట్ లో పాదచారులపైకి నలుపు రంగు ట్రక్కు దూసుకెళ్ళి 12 మందిని పొట్టనబెట్టుకోగా, ఈ ఉగ్ర దాడిలో మరో 50 మంది వరకు గాయపడిన సంగతి తెలిసిందే.
ఈ దాడి ఘటనలో ఓ పాకిస్తాన్ యువకుడిని ట్రక్కు డ్రైవర్ గా భావించి తొలుత అదుపులోకి తీసుకున్న బెర్లిన్ పోలీసులు ఆ తరువాత అతడికి ఎలాంటి సంబంధం లేదని భావించి వదిలేశారు. అనంతరం ఈ దాడికి పాల్పడింది తమ సైనికుడేనని, సంకీర్ణ కూటమిలోని దేశాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయమని ఇచ్చిన పిలుపు మేరకే ఈ దాడి జరిగిందని ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ 'అమాక్' ఒక ఆన్ లైన్ పోస్టులో వెల్లడించింది.
సిరియా, ఇరాక్ పై దాడులు నిర్వహిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అమెరికాతో కలిసి జర్మనీ కూడా పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో జర్మనీపై ప్రతీకారేచ్చతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బెర్లిన్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఒకవైపు ఈ ఉగ్ర దాడిలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండగా.. మరోవైపు ఈ దాడి ఘటనకు కారణమైన నిందితుడి కోసం వేట కొనసాగుతోంది. అయితే ఈ ఉగ్రదాడికి పాల్పడింది తామే అని ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.