‘వన్నాక్రై’ సైబర్ దాడుల వెనుక ఉత్తరకొరియా కిమ్ జాంగ్ ఉన్!?
‘వన్నాక్రై’ ర్యాన్సమ్ వేర్ సైబర్ దాడికి సంబంధించి జరిపిన పరిశోధనలో అనూహ్య విషయం వెలుగుచూసింది.
వాషింగ్టన్: నూట యాభై దేశాలను ఒక్కసారిగా వణికించిన 'వన్నాక్రై' ర్యాన్సమ్ వేర్ మూలాలు ఉత్తరకొరియాలో ఉన్నాయా? శుక్రవారం నాటి సైబర్ దాడుల వెనక ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హస్తం ఉందా?
ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో కంప్యూటర్లు హ్యాక్ కావడం ఉత్తర కొరియా హ్యాకర్ల పనేనా? తమ శత్రువులకు తన సత్తా ఏంటో చూపే లక్ష్యంలో భాగంగానే కిమ్ ఈ భయంకరమైన పనికి పూనుకున్నారా?
పై ప్రశ్నలకు అమెరికాలోని ఓ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ కంపెనీ అవుననే సమాధానమిస్తోంది. సైమాటెక్ అండ్ కాస్పర్స్కై లాబ్లో ఈ హ్యాకింగ్కు సంబంధించి జరిపిన పరిశోధనలో పరిశోధకులు ఓ 'కోడ్'ను కనుగొన్నారు. ఈ కోడ్ను బట్టే వారు ఈ దాడి వెనుక ఉత్తర కొరియా హస్తం ఉందని అనుమానిస్తున్నారు.
ఉత్తర కొరియాతో వ్యాపార సంబంధాలు నెరిపే చాలా కంపెనీల పరిశోధకులు.. ఈ కోడ్ ఉత్తర కొరియాకు సంబంధించినదే అని ధృవీకరిస్తున్నారు. వన్నా క్రై సాఫ్ట్వేర్లో ఈ కోడ్ ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సైబర్ దాడికి, ఉత్తర కొరియాకు సంబంధం ఉందనే దిశగా పరిశోధకులు మరింత తవ్వుతున్నారు.
వన్నా క్రై దాడుల తర్వాత ఇంతవరకూ లభించిన క్లూలలో ఇదే బెస్ట్ అని కాస్పర్స్కై ల్యాబ్ శాస్త్రవేత్త కుర్ట్ బౌగర్టెనర్ తెలిపారు. ఉత్తర కొరియానే ఈ దాడుల వెనక ఉందని చెప్పేందుకు ఈ సాక్ష్యం చాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ కోడ్ను విశ్లేషించి మరిన్ని వివరాలను ప్రభుత్వానికి అందేజేస్తామని కూడా పరిశోధకులు చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల రక్షణ విభాగాలపై సైబర్ దాడులు జరిగాయని, అమెరికా కూడా ఇందుకు మినహాయింపు కాదని అగ్రరాజ్య అధికారులు తెలిపారు. అయితే సాఫ్ట్వేర్ సెక్యూరిటీ కంపెనీలు చెప్పినట్లు.. ఉత్తర కొరియా సైబర్ దాడి చేసిందని తాము ధృవీకరించలేమన్నారు.
మరిన్ని సాక్ష్యాలు ఉంటే తప్ప ఎలాంటి ప్రకటన చేసేందుకు చట్టాలు అనుమతించవని, అయితే గతంలో జరిగిన మాల్వేర్ అటాక్, ప్రస్తుతం జరిగిన వన్నా క్రై సైబర్ అటాక్.. రెండూ ఒక గ్రూపు పనే అన్న అనుమానం కూడా కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు.