డీల్ కుదిరింది: బ్రెజిల్కు భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న బ్రిజెల్ దేశానికి భారత్ నుంచి టీకా వెళ్లనుంది. ఇప్పటికే మనదేశ ఫార్మా సంస్థలతో బ్రెజిల్ సంప్రదింపులు జరిపింది. తాజాగా, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా కోవాగ్జిన్ టీకాను సరఫరా చేసేందుకు అక్కడి మెడికల్ ఏజెన్సీ ప్రెసిసా మెడికామెంటోన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది.
జనవరి 7,8 తేదీల్లో వ్యాక్సిన్ వివరాలు, సరఫరా సాధ్యాసాద్యాలపై ప్రెసిఫా ప్రతినిధులు హైదరాబాద్లోని కేంద్రాన్ని సందర్శించినట్లు భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. ఇప్పటికే కోవాగ్జిన్ వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని తేలడంతోపాటు రోగనిరోధకతలోనూ మంచి పనితీరును కనబరుస్తుందనే విషయం రుజువైందని తెలిపారు.
బ్రెజిల్ ప్రజల ఆరోగ్య అవసరాలకు భారత్లో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు ఉపయోగపడుతున్నాయని కృష్ణ తెలిపారు. ఇక వ్యాక్సిన్ పనితీరులో భారత్ బయోటెక్ తయారు చేసిన టీకా తమ అంచనాలను మించి ఉందని బ్రెజిల్ ఫార్మా సంస్థ డైరెక్టర్ ఎమాన్యూయేల్ మోడ్రాడెస్ తెలిపారు. తాము భారత్ బయోటెక్ తో చేసుకున్న ఒప్పందం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
తమతోపాటు బ్రెజిల్లోని ప్రైవేటు సంస్థలు కూడా వ్యాక్సిన్ పంపిణీకి ప్రయత్నిస్తున్నాయన్నారు. అలాంటివారు బ్రెజిల్ నియంత్రణ సంస్థ అన్విసా నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, భారతదేశంలో కోవిషీల్డ్ తోపాటు కోవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. జనవరి 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు.
ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లతోపాటు ఎవరైతే కరోనా బారినపడి ఆరోగ్య విషమంగా ఉందో వారికి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తొలి దశలో సుమారు 30 కోట్ల మందికి ఈ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇదంతా ఆరు నుంచి ఎనిమిది నెలలో జరగనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్లు చేరుకోవడం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా కరోనా వ్యాక్సిన్లు చేరుకున్నాయి.