బైడెన్ టీమ్లోకి మరో భారత సంతతి వ్యక్తి... వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా వేదాంత్ పటేల్...
అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ భారత సంతతి వ్యక్తులకు తన టీమ్లో ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే కమలా హారిస్ను ఉపాధ్యక్షురాలిగా,నీరా టాండన్కు బడ్జెట్ చీఫ్గా బాధ్యతలు అప్పగించిన బైడెన్ తాజాగా మరో భారత సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారు. వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా ఇండియన్-అమెరికన్ వేదాంత్ పటేల్ను నియమించారు. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్, ప్రెస్ స్టాఫ్ కోసం మొత్తం 16 మంది టీమ్ను బైడెన్ ప్రకటించారు. క్రియేటివ్ కమ్యూనికేషన్స్లో వీరంతా నిష్ణాతులుగా చెబుతున్నారు.
ప్రస్తుతం బైడెన్ టీమ్లో వేదాంత్ పటేల్ సీనియర్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. బైడెన్ క్యాంపెయిన్ తరుపున రీజినల్ కమ్యూనికేషన్ డైరెక్టర్గానూ వ్యవహరించారు. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ క్యాంపెయిన్ తరుపున నెవాడా,వెస్టర్న్ ప్రైమరీ స్టేట్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్గా వ్యవహరించారు. గతంలో ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ ఎంపీ ప్రమీలా జయపాల్ టీమ్లో కూడా కమ్యూనికేషన్స్ డైరెక్టర్గా సేవలందించారు.భారత్లో జన్మించిన వేదాంత్ పటేల్ కాలిఫోర్నియాలో పెరిగారు. ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం పటేల్ తన కుటుంబంతో కలిసి వాషింగ్టన్ డీసీలో నివాసం ఉంటున్నారు.
'అమెరికన్ ప్రజలతో నేరుగా,నిజాయితీగా మాట్లాడటం ద్వారా వారిలో ప్రభుత్వంపై విశ్వాసాన్ని పునరుద్ధరించాలన్నది మా ప్రధాన ఉద్దేశం. ఈ ప్రయత్నానికి మా కమ్యూనికేషన్స్,ప్రెస్ సిబ్బంది సమగ్ర కృషి చేయడమే కాదు.. అమెరికన్ ప్రజలందరి కోసం దేశాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారు. వైట్ హౌస్లో అమెరికన్ ప్రజలకు సేవ చేసే అవకాశం లభించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.'అని అని తాజా నియామాకాలను ఉద్దేశించి బైడెన్ అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది నవంబరు 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి బైడెన్కు 306 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు రాగా రిపబ్లికన్ నేత డొనల్డ్ ట్రంప్కు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల సమావేశమైన ఎలక్టోరల్ కాలేజ్ బైడెన్ విజయాన్ని నిర్దారించడంతో అధ్యక్ష పీఠంపై కూర్చొనేందుకు అధికారిక ద్వారాలు తెరుచుకున్నాయి. బైడెన్ గెలిచినట్లు ఎలక్టోరల్ కాలేజ్ నిర్ధారిస్తే వచ్చే జనవరిలో తాను వైట్ హౌస్ను వీడుతానని ఇదివరకే ట్రంప్ ప్రకటించారు.