బిడెన్ ప్రమాణ స్వీకారం వేళ.. బాంబు బెదిరింపు: క్షణాల్లో ఖాళీ: ఉలిక్కిపడ్డ వాషింగ్టన్: గార్డ్స్
వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకార మహోత్సవ క్షణాలు సమీపిస్తోన్న వేళ.. ఆ దేశ పార్లమెంట్ భవనం కేపిటల్ బిల్డింగ్కు మాజీ అధినేతలు ఒక్కరొక్కరుగా చేరుకుంటోన్న సమయంలో.. వాషింగ్టన్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. వాతావరణం మారిపోయింది. భయాందోళనలు అలముకున్నాయి. దీనికి కారణం- అమెరికా అత్యున్నత న్యాయస్థానానికి బాంబు బెదిరింపు రావడమే. ఈ సమాచారం అందుకున్న క్షణాల వ్యవధిలో నేషనల్ గార్డులు ఎంట్రీ ఇచ్చారు.
ట్రంప్ వైట్హౌస్ను వీడిన వేళ..జో బిడెన్ సంచలన ట్వీట్: దిసీజ్ యువర్ టైమ్: ఒబామా
సుప్రీంకోర్టును ఖాళీ చేయించే పనిలో నిమగ్నం అయ్యారు. అణువణువూ తనిఖీ చేపట్టారు. బిడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆ దేశ పార్లమెంట్ భవనం.. కేపిటల్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేశారు. జో బిడెన్, కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఈ కార్యక్రమానికి డెమొక్రటిక్ నేతలు, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, మిఛెల్లి ఒబామా, బిల్ క్లింటన్ హాజరయ్యారు. వారి రాక కొనసాగుతుండగానే.. సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపులు అందాయి.
ఈ విషయాన్ని సుప్రీంకోర్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ (స్కోటస్) అధికార ప్రతినిధి ధృవీకరించినట్లు సీఎన్ఎన్ వెల్లడించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సరిగ్గా గంట ముందు- అంటే ఉదయం 9:30 గంటలకు బాంబు బెదిరింపు అందినట్లు వెల్లడించింది. బాంబు బెదిరింపు అందిన వెంటనే నేషనల్ సెక్యూరిటీ గార్డులు సుప్రీంకోర్టు వద్దకు చేరుకున్నారు. భవన సముదాయాన్ని ఖాళీ చేయించారు. ప్రస్తుతం అణువణువూ తనిఖీ చేపట్టారు.
ఇప్పటిదాకా బాంబు ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లూ లభించలేదని ప్రజా సంబంధాల అధికారి వెల్లడించారు. అయినప్పటికీ.. ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నామని తెలిపారు. బాంబు బెదిరింపు అందిన సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ భవనంలోనే ఉన్నట్లు భావిస్తున్నారు. ఆయనే జో బిడెన్తో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లడానికి సన్నాహాలు చేస్తోన్న సమయంలో బాంబు బెదిరింపు అందినట్లు సమాచారం.