జో బైడెన్ అదిరిపోయే స్పీచ్... అప్పుడే కార్యక్షేత్రంలోకి... ఇకపై విడగొట్టే రాజకీయాలు ఉండవంటూ...
అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ చివరి అంకానికి చేరుకున్నవేళ... డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ అమెరికన్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. తుది ఫలితం ఇంకా రానప్పటికీ... ఇప్పటికవరకూ వెల్లడైన నంబర్స్తో విజయం తమదేనని తేలిపోయిందన్నారు. ట్రంప్పై 40లక్షల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నామని... 74 మిలియన్ల మంది అమెరికన్లు తమకు ఓటు వేశారని బైడెన్ పునురుద్ఘాటించారు. ప్రాంతాలు,మతాలకు అతీతంగా అమెరికన్లు వ్యవస్థలో మార్పు కోరుకుంటున్నారని... కరోనా వైరస్,ఆర్థిక వ్యవస్థ,పర్యావరణ మార్పు,జాతి విద్వేషం వంటి అంశాల్లో తమ ప్రణాళికలకు ఓటర్లు పట్టం కట్టారని చెప్పారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్షేత్రంలోకి దిగుతున్నామని ప్రకటించారు.
అమెరికా : తుది ఫలితం తేలే వేళ సుప్రీం ట్విస్ట్... ఎన్నికల అధికారులకు కీలక ఆదేశాలు
బైడెన్ స్పీచ్..
24గంటల క్రితం మేము జార్జియాలో వెనుకంజలో ఉన్నాం... 24 గంటల క్రితం పెన్సిల్వేనియాలో కూడా వెనుకంజలో ఉన్నాం.. ప్రస్తుతం ఆ రెండు చోట్ల మేము ఆధిక్యంలో కొనసాగుతున్నాం.అమెరికా చరిత్రలోనే ఏ అధ్యక్ష అభ్యర్థికి రానన్ని ఓట్లు(74మిలియన్లు) ఇప్పటివరకూ పోల్ అయ్యాయి. అటు 24 ఏళ్ల తర్వాత మొదటిసారి అరిజోనాలో,28 ఏళ్ల తర్వాత మొదటిసారి జార్జియాలో గెలవబోతున్నాం. నాలుగేళ్ల క్రితం రిపబ్లికన్లు గెలిచిన రాష్ట్రాలు ఇప్పుడు మళ్లీ నీలం వర్ణం సంతరించుకుంటున్నాయి.' అని బైడెన్ తెలిపారు.
తొలిరోజు నుంచే కోవిడ్ 19పై వార్...
ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల ప్రకారం 300 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను గెలుచుకోబోతున్నట్లు బైడెన్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే కరోనా వైరస్ నియంత్రణ కోసం తమ ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. కరోనా కారణంగా తమవాళ్లను కోల్పోయినవారి బాధ వర్ణనాతీతం అన్నారు. ఆ లోటును తీర్చలేకపోయినప్పటికీ... కరోనా నుంచి అమెరికన్లను కాపాడేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతామన్నారు.
సంయమనం పాటించాలని పిలుపు...
ఇప్పటికే స్పష్టమైన మెజారిటీ రావడంతో ఇక ఆలస్యం చేయకుండా కార్యక్షేత్రంలో దిగుతున్నట్లు బైడెన్ ప్రకటించారు. ఎకానమీ,కోవిడ్ 19,పర్యావరణ మార్పులు,తదితర అంశాలపై చర్చించేందుకు ఈ రాత్రికే(అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం-నవంబర్ 5)కే నిపుణులతో భేటీ అవుతున్నట్లు తెలిపారు. రాజకీయమంటే దేశ ప్రజల కోసం పనిచేయడమని చెప్పారు. ప్రస్తుత సంక్లిష్ట తరుణంలో అమెరికాలో ఆందోళనలు,ఉద్రిక్తతలు ఉంటాయని తనకు తెలుసునని... అయితే ప్రతీ ఒక్కరూ ఓర్పుతో,సంయమనంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ప్రత్యర్థులం కావచ్చు కానీ అమెరికన్లుగా మనమంతా ఒక్కటేనని చెప్పారు. ఇకనుంచి విడగొట్టే రాజకీయాలు ఉండవని... అందరినీ ఐక్యం చేసే రాజకీయాలే ఉంటాయని స్పష్టం చేశారు.
బైడెన్ ఎన్నిక లాంఛనమే...
కీలక రాష్ట్రాలైన నెవాడా,జార్జియా,పెన్సిల్వేనియాల్లోనూ జో బైడెన్ ముందంజలో ఉన్నారు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితం దాదాపుగా వన్ సైడ్ అయిపోయింది. అధ్యక్ష ఎన్నికకు పోలింగ్ జరిగిన మొదటిరోజున(నవంబర్ 3) ట్రంప్,బైడెన్ మధ్య హోరాహోరీ పోటీ కనిపించినప్పటికీ.. ఆ తర్వాత క్రమంగా బైడెన్ ట్రంప్ను వెనక్కి నెడుతూ వచ్చారు. అధికారికంగా ఇప్పటికే 264 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు గెలుచుకున్నారు. నెవాడా,జార్జియా,పెన్సిల్వేనియాల్లో గెలుపు లాంఛనమే కావడంతో... మొత్తంగా 300 ఎలక్టోరల్ ఓట్లు ఆయన ఖాతాలో చేరే అవకాశం ఉంది.