అంతర్జాతీయ కోర్టులో భారత్ విజయం.. కులభూషన్ జాదవ్ ఉరిశిక్ష నిలిపివేత
ది హేగ్ : అంతర్జాతీయ కోర్టులో భారత్కు ఊరట కలిగింది. గూఢచర్యం ఆరోపణలతో భారత్కు చెందిన మాజీ నేవీ అధికారి కుల్భూషన్ జాదవ్పై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ కోర్టు నిలిపివేసింది. జాదవ్ కేసును పున:సమీక్షించాలని పాకిస్థాన్ మిలిటరీ కోర్టుకు సూచించింది. ఈ కేసులో మొత్తం 16 మంది జడ్జిలు ఉండగా .. జాదవ్ మరణశిక్షను 15 మంది న్యాయమూర్తులు వ్యతిరేకించారు. అంతేకాదు కేసుకు సంబంధించి భారత్ న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని స్పష్టంచేసింది.
వాద, ప్రతివాదనలు
జాదవ్ కేసులో భారత్, పాకిస్థాన్ వాద, ప్రతివాదనలు అంతర్జాతీయ న్యాయస్థానం ఆలకించింది. ఈ కేసులో ఇవాళ తీర్పు వెల్లడించింది. కాసేపటి క్రితం సీజేఏ అబ్దుల్ అహ్మద్ యూసుఫ్ నేతృత్వంలోని 10 మంది సభ్యులు గల ధర్మాసనం తీర్పునిచ్చింది. పాకిస్థాన్ మోపిన కుట్రపూరిత అభియోగాలపై 2017 మే 8న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించింది. మాజీ నేవీ అధికారిపై లేనిపోని ఆరోపణలు చేసిందని వాదనలు వినిపించింది. భారత్ తరఫున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు.
ఇదీ నేపథ్యం ..
బలూచిస్థాన్లో ఉన్న జాదవ్ను పాకిస్థాన్ మిలిటరీ అదుపులోకి తీసుకుంది. 2016 మార్చి 3న .. ఇరాన్ నుంచి వ్యాపార నిమిత్తం వస్తోన్న అతడిని అరెస్ట్ చేసింది. తర్వాత జాదవ్ కిడ్నాప్నకు గురయ్యాడని భారత్ ఫిర్యాదు చేసింది. కానీ ఇరాన్లో లేకపోవడంతో అనుమానం వచ్చింది. కానీ తోలుత నిరాకరించిన తర్వాత తమ వద్దే ఉన్నాడని అంగీకరించింది. తమ దేశంపై నిఘా పెట్టారనే ఆరోపణలు మోపి .. మిలిటరీ కోర్టులో అభూత సాక్ష్యాలు ప్రవేశపెట్టింది. ఆ తర్వాత జరిగిన ఉద్రిక్తతతో .. జాదవ్ తల్లి, భార్య .. 2017 డిసెంబర్ 25న జైలులో కలిసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు అంతర్జాతీయ కోర్టులో భారత్కు ఊరట లభించింది.
భారత్ విజయం ..
జాదవ్ కేసులో అంతర్జాతీయ కోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ చొరవను మాజీ కేంద్రమంత్రి సుష్మస్వరాజ్ అభినందించారు. మోడీ సర్కార్ చర్యలతో అంతర్జాతీయ కోర్టులో జాదవ్కు ఊరట కలిగిందని పేర్కొన్నారు. మరోవైపు జాదవ్ ఉరిశిక్షను పున:సమీక్షించాలన్న అంతర్జాతీయ కోర్టు తీర్పును గౌరవిస్తామని పాకిస్థాన్ లాయర్లు తెలిపారు. ఉరిశిక్షను పున:సమీక్షించాలని చెప్పడంతో .. ఈ కేసులో భారత్ వాదనలు వినిపించనున్నది. ఇది తాత్కాలిక విజయమేనని, పాకిస్థాన్ మిలిటరీ కోర్టులో మరింత బలంగా వాదనలు వినిపించి శాశ్వతంగా ఊరట పొందాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.