హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట: ట్రంప్ నిర్ణయాలకు చెక్ పెట్టిన జో బైడెన్
వాషింగ్టన్: వలస విధానాలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా పక్కన పెడుతున్నారు నూతన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. తాజాగా, జో బైడెన్ తీసుకున్న నిర్ణయం హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట కల్పించింది. ఈ నిర్ణయం భారతీయ టెక్కీలకు ఎంతో ప్రయోజనకారిగా ఉండనుంది.
Recommended Video
కాగా, హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల(భార్య/లేదా భర్త)తోపాటు 21 ఏళ్ల లోపు పిల్లలకు.. అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ(యూఎన్సీఐఎస్) హెచ్4 వీసాలు జారీ చేస్తుంటుంది. అయితే, మొదట హెచ్4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుండేది కాదు. దీంతో హెచ్1బీ వీసారుదాలపై ఆర్థికభారం అధికంగా ఉండేది. ఈనేపథ్యంలో హెచ్4 వీసాదారులు చట్టపరంగా అమెరికాలో ఉద్యోగం చేసుకునేలా పని అనుమతిస్తూ 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలస విధానంపై కఠినంగా వ్యవహరించారు. హెచ్4 వీసాదారులకు పని అనుమతులు రద్దు చేయనున్నట్లు యూఎస్ కోర్టుకు తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిబంధనల కారణంగా అమెరికాలో ఉంటున్న చాలా మంది భాగస్వాముల భవితవ్యం గందరగోళంలో పడింది. ఈ నేపథ్యంలోనే వారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ అమెరికా చట్టసభ్యులు గత డిసెంబర్ నెలలో బైడెన్ను కలిశారు.
హెచ్4 వీసాలతో అమెరికాలో పనిచేస్తున్న ఎంతో మంది విదేశీ మహిళలు, వైద్యంతోపాటు అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత కరోనా సమయంలో వారి అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. హెచ్4 వీసాలపై ట్రంప్ విధానాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే ట్రంప్ తీసుకొచ్చిన నూతన వలస విధానాన్ని బైడెన్ సర్కారు వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా బైడెన్ నిర్ణయం ఎంతో మంది భారతీయులకు ఊరట కలిగించిందనే చెప్పాలి.