భారత్కు గొప్ప విజయం : మసూద్ అజార్ను గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించిన యూఎన్ఓ
Recommended Video
న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ చేస్తున్న ఒత్తిడి ఎట్టకేలకు ఫలించింది. మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి వర్గాలు కాసేపటి క్రితం ప్రకటించాయి. దీంతో గత కొంతకాలంగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లైంది.
గ్లోబల్ టెర్రరిస్ట్ ..
మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించినట్టు ఐక్యరాజ్యసమితిలో భారత అంబాసిడర్ సయ్యద్ అక్బరుద్దీన్ ధ్రువీకరించారు. ఈ మేరకు ఆయన కాసేపటి క్రితం ట్విట్ చేశారు. చిన్న, పెద్ద అందరికీ శుభవార్త .. మసూద్ అజహర్ ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిందని పేర్కొన్నారు.
ఇన్నాళ్లు అడ్డుకున్న డ్రాగన్
మసూద్ అజహర్ విషయంలో డ్రాగన్ చైనా మెతక వైఖరి అవలంభించింది. ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్టులో పెట్టకుండా నాలుగుసార్లు అడ్డుకొని .. తన ప్రేమను చాటుకుంది. పుల్వామా దాడి తర్వాత జైషే సంస్థపై నిషేధం విధించాలని అంతర్జాతీయ సమాజంపై భారత్ ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ క్రమంలో చైనా కూడా కొన్ని అభ్యంతరాలను పెట్టింది. తాజాగా తన అభ్యంతరాలను వెనక్కి తీసుకోవడంతో అజహర్ ను యూఎన్ వో అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తున్నట్టు ప్రకటించింది.
నో కామెంట్స్ ..
అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్టు యూఎన్వో ప్రకటించడంపై దాయాది పాకిస్థాన్ కూడా స్పందించింది. మసూద్ కు గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఆ దేశం ఇప్పటికే ఉగ్రవాదులకు శిక్ష ఇస్తున్నదనే అపవాదును మూట గట్టుకొంది. ఈ క్రమంలో స్పందిస్తే ఏమనుకుందో ఏమో కానీ యూఎన్వో నిర్ణయంపై మాత్రం స్పందించలేదు.
ఫలించిన భారత్ ఒత్తిడి
జైషే సంస్థ చీఫ్ మసూద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించడంతో అతనిపై ప్రపంచ దేశాలు చర్యలు తీసుకునేందుకు రాచమార్గం అవుతోంది. అలాగే విదేశా్లో ఉన్న ఆస్తులను బేషరతుగా జప్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అగ్రరాజ్యాలతో భారత్ జరిపిన చర్చల వల్ల మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది.