బైకర్ గ్యాంగ్ కాల్పులు, తొమ్మిది మంది దుర్మరణం
టెక్సాస్: పార్కింగ్ విషయంలో గొడవ జరిగి సహనం కోల్పోయి కాల్పులు జరపడంతో 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్దరాత్రి కాల్పులు జరిపిన నిందితులు అక్కడి నుండి పరారైనారు.
ఆదివారం అర్దరాత్రి టెక్సాస్ లోని వాకా వద్ద పీక్స్ రెస్టారెంట్ వద్దకు కొందరు వెళ్లారు. రెస్టారెంట్ సమీపంలో వాహనాల పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. సహనం కోల్పోయిన కొందరు తుపాకులతో ఇష్టారీతిగా కాల్పులు జరిపారు.
ఈ కాల్పులలో 8 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఒకరు మరణించారు. ఈ కాల్పులలో 18 మందికి తీవ్రగాయాలైనాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
రైవల్ బైకర్ గ్యాంగ్ కాల్పులకు పాల్పడిందని పోలీసులు ఆధారాలు సేకరించారు. రెస్టారెంట్ సమీపంలో, పార్కింగ్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నామని, దుండగులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.