కాశ్మీర్: బిలావల్పై జోక్స్, పరేష్ కథ, మోడీకి మద్దతు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో కాశ్మీర్ పైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను జోకర్గా పేర్కొంటూ సామాజిక వెబ్సైట్లలో సెటైర్లు వేస్తున్నారు. బిలావల్ వ్యాఖ్యలు అతిపెద్ద జోకులు అంటూ స్పందిస్తున్నారు.
బిలావల్ భుట్టో వంటి వారు ఇలాంటి జోకులతో కచ్చితంగా చంపేస్తారని వ్యాఖ్యానిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నక్వీ.. బిలావల్ వ్యాఖ్యలు చిన్నపిల్లాడివిలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. భుట్టో కుటుంబం జనరేషన్స్ మారినా.. మైండ్ సెట్ మాత్రం మారలేదని రామ్ మాధవ్ అన్నారు.
శశిథరూర్, సునంద పుష్కర్ వివాదంలో వెలుగులోకి వచ్చిన పాకిస్తాన్ మెహర్ తరర్ కూడా స్పందించారు. పాకిస్తాన్, భారత్లు పేదరికం, నిరుద్యోగం, అక్షరాస్యత, జనాభా, చిన్నతనంలో వివాహం, అత్యాచారులు.. తదితర అంశాలపైన దృష్టి సారించాలని హితవు పలికారు.
ప్రముఖ పరేష్ రావల్ కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పరేష్ రావల్ కూడా ఒక జోక్ చెప్పారు. చందమామపై ఒక్కడే పాకిస్థానీ ఉంటే సమస్య, అదే చందమామపై పదిమంది పాకిస్థానీలు ఉన్నా సమస్యనే, అదే చందమామపై అందరూ పాకిస్థానీలే ఉంటే పరిష్కారం అంటూ ఎద్దేవా చేశారు.
బిలావల్ భుట్టో పైన ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ (ఐయూఎంఎల్) కూడా ఆదివారం మండిపడింది. బిలావల్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేసింది. భారత్ భూభాగంలోని ప్రతి ఇంచును కూడా తాము చివరి నిమిషం వరకు కాపాడుకుంటామన్నది. పాకిస్తాన్లోని చాలామంది రాజకీయ నాయకుల వలే తాను కూడా ఓ పగటి కలకనే వాడినని బిలావల్ నిరూపించుకున్నారని ఐయూఎంఎల్ చీఫ్, ఎంపీ అహ్మద్ అన్నారు.
భారత దేశం మొత్తం, ముఖ్యంగా పదిహేడు కోట్ల మంది ముస్లీంలు భారత్ కోసం ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ చివరి రక్తపు బొట్టు వరకు భారత్ కోసం ఉన్నారన్నారు.
తద్వారా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను అహ్మద్ బలపరిచినట్లయిందని అంటున్నారు. రెండు రోజుల క్రితం మోడీ మాట్లాడుతూ.. భారత్ ముస్లీంలు దేశం కోసం పని చేస్తారని, వారి దేశం కోసం బతుకుతారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు, మోడీ వ్యాఖ్యలను పలు ముస్లీం సంఘాలు, పలువురు ముస్లీంలు ప్రశంసిస్తున్నారు.