ఇన్నేళ్ల తర్వాత బయటపెట్టిన షరీఫ్: 'క్లింటన్'పై సంచలనం.. అలా ప్రలోభ పెట్టి?
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తనకు 5బిలియన్ డాలర్లు ఆఫర్ చేశారని తెలిపారు.
ఇస్లామాబాద్: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణుపరీక్షలు జరపకుండా ఉండేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తనకు 5బిలియన్ డాలర్లు ఆఫర్ చేశారని తెలిపారు. ఆ సమయంలో దేశం పట్ల తాను విధేయుడిగా వ్యవహరించకపోయి ఉంటే ఆ డబ్బు తీసుకుని ఉండేవాడినని అన్నారు.
పంజాబ్ ప్రావిన్సులో ఏర్పాటు చేసిన ఓ బహరింగ సమావేశంలో అణుపరీక్షలపై ప్రధాని షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1998లొ తనను కలిసిన బిల్ క్లింటన్ అణు పరీక్షలు నిలిపివేయాలని కోరినట్లు చెప్పారు. అందుకు ప్రతిగా 5బిలియన్ డాలర్లు ఇస్తానని ప్రలోభ పెట్టారని అన్నారు. అయితే క్లింటన్ ప్రలోభాలకు తాను లొంగలేదన్నారు.
ప్రస్తుతం పనామా పేపర్ల కుంభకోణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న షరీఫ్.. వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా దేశం పట్ల తానెంత విధేయుడిగా ఉన్నానో తెలిపేందుకు.. క్లింటన్ వ్యవహారం గురించి చెప్పారు షరీఫ్. రోజురోజుకు ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్స్ సూతం పెరుగుతున్నాయి.