ఉగ్రవాది ఐఫోన్: ఎఫ్బీఐకి మద్దతు పలికిన బిల్గేట్స్
న్యూయార్క్: అమెరికాలోని శాన్బెర్నార్డినోలో దాడులకు పాల్పడిన ఉగ్రవాది సయద్ రిజ్వాన్ ఫరూఖ్ ఐఫోన్ కేసు విషయంలో యాపిల్ సంస్థకు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ బిల్గేట్స్ ఎఫ్బీఐకు మద్దతు పలికారు.
అసలేం జరిగింది?: యాపిల్ ఐఫోన్ అంత గోప్యమా?
మంగళవారం ఆయన ఫైనాన్షియల్ టైమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉగ్రవాద కార్యకలాపాల్లో చట్టం అమలు చేసేందుకు టెక్నాలజీ సంస్ధలు అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. శాన్బెర్నార్డినో ఉగ్రదాడిని ప్రత్యేక కేసుగా భావించి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు అనుమతి కోరింది.
అంతే తప్ప సాధారణ సమయంలో కాదు కదా అని ఆయన అన్నారు. ప్రభుత్వ కేసుల్లో భాగంగా టెలికాం సంస్థలు, బ్యాంకుల నుంచి వ్యక్తిగత వివరాలను సేకరిస్తుందని అందులో భాగంగానే యాపిల్ సంస్థను కూడా ఎఫ్బీఐ కోరిందని ఆయన అభిప్రాయపడ్డారు.
గతేడాది అమెరికా కాలిఫోర్నియా శాన్బెర్నార్డినోలో సయద్ రిజ్వాన్ ఫరూఖ్ అనే ఐఎస్ ఉగ్రవాది విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడి 14 మంది ప్రాణాల్ని బలిగొన్న సంగతి తెలిసిందే. అనంతరం పోలీసుల జరిపిన కాల్పుల్లో రిజ్వాన్ ఫరూక్ హతమయ్యాడు. ఆ తర్వాత రిజ్వాన్ వ్యక్తిగత ఐఫోన్ను ఎఫ్బీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దానిని అన్లాక్ చేసి ఇవ్వాలని యాపిల్ సంస్థను కోరారు. నిందితుడి ఐఫోన్లోని సమాచారాన్ని పొందేందుకు దానిని తెరిచే మాల్వేర్ తయారు చేయాలంటూ ఎఫ్బీఐ ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే అందుకు యాపిల్ నిరాకరించడం తెలిసిందే. అలా మాల్వేర్ రూపొందిచండం వల్ల యాపిల్ కస్టమర్లందరి రక్షణను బలహీన పరుస్తుందని స్పష్టం చేసింది.
దీనిపై ఎఫ్బీఐ కోర్టును ఆశ్రయించగా సయీద్ రిజ్వాన్ ఫారూఖ్ ఫోన్ను అన్లాక్ చేసి ఎఫ్బీఐ దర్యాప్తు అధికారులకు సహకరించాలని అమెరికాలోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై న్యాయస్థానం ఆదేశాల్ని అమలు చేయడం తమ వినియోగదారులకు ప్రమాదకరమనీ, హ్యాకర్లకు అవకాశం కల్పించినట్లవుతుందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు.