Bill Gates: అమెరికాకు షాకిచ్చి, చైనాకు అనూహ్య మద్దతు, కరోనాపై పోరుకు భారీ విరాళం ప్రకటన
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా లక్ష మందికిపైగా ప్రాణాలు తీసిన కరోనావైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆ వైరస్ సహజంగా పుట్టిందా? లేక ల్యాబ్ సృష్టా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అమెరికాతోపాటు అనేక దేశాలు చైనాను కరోనావైరస్ వ్యాప్తి విషయంలో దోషిగానే చూస్తున్నాయి.
Recommended Video
చైనాకు బిల్ గేట్స్ బాసట..
కరోనావైరస్ ల్యాబ్ సృష్టి కాదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చైనాకు కొంత ఊరట కలిగించినా.. అమెరికా లాంటి దేశాలు మాత్రం చైనాపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే దీనిపై అమెరికా విచారణకు కూడా జరుపుతోంది. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చైనాకు మద్దతుగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చైనావి సరైన చర్యలే కానీ..
చైనాపై ఆరోపణలు చేయడానికి ఇది సమయం కాదని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సమర్థ ప్రణాళికలతో ముందుకు సాగాలని అమెరికాతోపాటు ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అంతేగాక, కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి చైన సరైన చర్యలే చేపట్టిందని వ్యాఖ్యానించారు. అయితే, ఆ తర్వాత ఎక్కడ అదుపు తప్పిందో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉందని డ్రాగన్ దేశానికి హితవు పలికారు.
అమెరికా ఘోరంగా విఫలం..
కరోనావైరస్ వెలుగులోకి వచ్చిన వెంటనే కొన్ని దేశాలు చాలా వేగంగా స్పందించాయని, ఆ తద్వారా భారీ ఆర్థిక నష్టం నుంచి బయటపడ్డాయని బిల్ గేట్స్ తెలిపారు. అయితే ఈ విషయంలో అమెరికా మాత్రం ఘోరంగా విఫలమైందని వ్యాఖ్యానించారు. వేగంగా పరీక్షల నిర్వహణ, రోగులకు చికిత్స అందించడం, వ్యాక్సిన్ను వీలైనంత త్వరగా తయారుచేయడం వంటి కీలక అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు చైనాపై ఆరోపణలు చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని అన్నారు. ఇది మానవాళిని రక్షించే శాస్త్ర సాంకేతికతకు పెద్ద పీట వేస్తూ ముందుకు సాగాల్సిన సమయమని అన్నారు.
డబ్ల్యూహెచ్ఓపై ప్రశంసలు.. మరోసారి భారీ విరాళం..
ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)పై అమెరికాతోపాటు పలు దేశాలు విమర్శలు చేయడంపైనా బిల్ గేట్స్ స్పందించారు. కరోనాను ఎదుర్కోవడంలో డబ్ల్యూహెచ్ఓ ఎనలేని కృషి చేస్తోందని ప్రశసించారు. డబ్ల్యూహెచ్ఓతో అమెరికాకు మెరుగైన సంబంధాలే ఉన్నాయని, అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ)తో కలిసి పనిచేస్తోందని వివరించారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేట్స్ ఈ మేరకు స్పందించారు. కాగా, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున మరో 150 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. కరోనా చికిత్సల్ని అభివృద్ధి చేయడం, వ్యాక్సిన్ పై పరిశోధనలు, వైద్యారోగ్య సదుపాయాలను మెరుపర్చేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నామని మిలిందా గేట్స్ వివరించారు. కాగా, డబ్ల్యూహెచ్ఓ చైనాకు మద్దతుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలతో ఆ సంస్థకు డొనాల్డ్ ట్రంప్ నిధులను నిలిపివేసిన విషయం తెలిసిందే.