బిన్ లాడెన్ వారసుడొచ్చాడు: ఎవరితను? ప్రపంచ దేశాల నిఘా
అమెరికాతో సహా ప్రపంచ దేశాలను గడగడలాడించిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు వారసుడు వచ్చాడని తెలుస్తోంది. వివిధ ఉగ్రసంస్థల సహచర్యంతో తిరుగులేని శక్తిగా ఎదగడానికి అల్ ఖైదా తిరిగి ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
కరాచి: అమెరికాతో సహా ప్రపంచ దేశాలను గడగడలాడించిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు వారసుడు వచ్చాడని తెలుస్తోంది. వివిధ ఉగ్రసంస్థల సహచర్యంతో తిరుగులేని శక్తిగా ఎదగడానికి అల్ ఖైదా తిరిగి ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ తనయుడు 28 ఏళ్ల హమ్జా బిన్ లాడెన్ సంస్థ పగ్గాలు చేపట్టనున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. హమ్జా కదలికలపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి.
హమ్జా నేతృత్వంలో వివిధ ఉగ్రవాద వర్గాల ఏకీకరణకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఆయన మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వ్యక్తి కావడంతో యువత ఆకర్షిలవుతారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అల్ఖైదాకు చెందిన పలువురు అగ్రనాయకులు కూడా గతంలో హమ్జానే వారసుడని తీర్మానించారు. రెండేళ్ల క్రితమే అతన్ని గుహ నుంచి వచ్చిన సింహమని అల్ జవహరి అభివర్ణించారు.
నిజానికి లాడెన్కు కూడా ఇలాంటి అభిప్రాయమే ఉండేది. లాడెన్కు ఉన్న 20 మంది సంతానంలో హమ్జా 15వవాడు. మూడో భార్య ఖైరియా సబర్ కుమారుడు. ఆమెకు ఉన్న సంతానంలో హమ్జా ఒక్కడే కుమారుడు. ఖైరియా అంటే ఒసామాకు ఎంతో ఇష్టం.
సౌదీకి చెందిన ఆమె మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్న తనంలో హమ్జా తల్లిదండ్రుల వద్దే పెరిగాడు. మొదట సౌదీ అరేబియా, అనంతరం సుడాన్, అఫ్ఘానిస్థాన్లలో కూడా ఉన్నాడు.
కొంతకాలం పశ్చిమ పాకిస్థాన్లో కూడా నివసించాడు. ఆయనకు పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నారని సమాచారం. అయితే ఆయన ఫొటో ఎక్కడా బయటపడలేదు. తండ్రిలాగానే గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం.
అల్ ఖైదా కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులు భావించేవారు. అయితే తాను దూరంగా ఎందుకుండాలంటూ వారితో వాదించేవాడని తెలుస్తోంది. అమెరికాలో దాడులు అనంతరం బిన్ లాడెన్, ఇతర అనుచరులు తూర్పు అఫ్ఘానిస్థాన్లోని తోరాబోరా కొండల్లో దాక్కున్నారు.
అప్పుడే లాడెన్ తన భార్యాపిల్లలను ఇరాన్లోని సురక్షిత ప్రాంతాలకు పంపించి వేశాడు. అనంతరం హమ్జా తండ్రిని పెద్దగా కలవలేదు. ఇరాన్లో దాదాపుగా గృహ నిర్బంధంలో ఉన్నట్టుగా ఉండేవాడు. దీనిపై అసంతృప్తి చెందుతూ పవిత్ర సైనికుని (ముజాహిదీన్)గా పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ 2009లో తండ్రికి లేఖ రాశాడు.
తండ్రి ఒసామా పశ్చిమ దేశాలపై కేవలం సాయుధ పోరాటానికే ప్రాధాన్యం ఇవ్వగా, హమ్జా మాత్రం పోరాటాలతో పాటుగా, సాధ్యమైన అన్ని మార్గాల్లో ఆ దేశాలకు నష్టం కలిగించాలని అనుచరులకు చెబుతారని అంటారు.