బిట్ కాయిన్ దూసుకుపోతోంది... నెల రోజుల్లో రూ. 14 లక్షల నుంచి 24 లక్షలకు పెరిగిన విలువ
క్రిప్టోకరెన్సీ జోరు కొనసాగుతుండడంతో బిట్ కాయిన్ విలువ ఆదివారం మొదటిసారి 34 వేల డాలర్ల (రూ. 24,80,000) మార్కును దాటింది.
తర్వాత దీని విలువ 33 వేల డాలర్లకు పడిపోయినప్పటికీ, ఈ ఏడాది ఇది దాదాపు 5 వేల డాలర్ల లాభాలు సంపాదించిందని కాయిన్ డెస్క్ వెబ్సైట్ చెప్పింది. గత ఏడాది డిసెంబర్ 4న 19,000 డాలర్లకు చేరిన బిట్ కాయిన విలువ ఇప్పుడు 30,000 డాలర్ల మార్క్ను దాటింది.
గత ఏడాది మిగతా డిజిటల్ కరెన్సీల విలువ పెరగడంతోపాటూ, బిట్ కాయిన్ ధర కూడా 300 శాతం పెరిగింది..
2020లో రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎథెరెయం విలువ కూడా 465 శాతం పెరిగింది.
అమెరికా డాలర్ మరింత పతనం కావడంతో, బిట్ కాయిన్ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
కరోనా మహమ్మారి వచ్చినప్పుడు మార్చిలో అనిశ్చితి సమయంలో పెట్టుబడిదారులు భద్రత కోరుకోవడంతో అమెరికా డాలర్ విలువ పెరిగింది. తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి వచ్చిన భారీ ఉద్దీపనల వల్ల అది పతనమైంది. 2017 తర్వాత అతిపెద్ద నష్టంతో డాలర్ గత ఏడాదిని ముగించింది.
డాలర్, పౌండ్ స్టెర్లింగ్ లాంటి నిజమైన కరెన్సీ లాగే బిట్ కాయిన్ లావేదేవీలు కూడా జరిగాయి.
- బిట్ కాయిన్లు: అప్పుడు నిషేధించారు... ఇప్పుడు దూసుకుపోతున్నాయి...
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్ను తలపించే స్టోరీ
పేపాల్ లాంటి ఎన్నో సంస్థలు డిజిటల్ కరెన్సీని స్వీకరించడంతో, ఇటీవల ఆన్లైన్ చెల్లింపుల రూపంలో దీనికి మద్దతు కూడా పెరిగింది.
కానీ, క్రిప్టోకరెన్సీ అస్థిరమైన పెట్టుబడి అనేది కూడా నిరూపితమైంది.
నాటకీయ దిద్దుబాట్ల వల్లే బిట్ కాయిన్ విలువ పెరుగుతోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. మూడేళ్ల క్రితం 2017లో కూడా బుల్ రన్ తర్వాత బిట్ కాయిన్ విలువ కుప్పకూలింది. అప్పుడు బిట్ కాయిన్ విలువ 20 వేల డాలర్లకు దగ్గరగా వచ్చింది. నవంబర్లో హఠాత్తుగా పతనం అయ్యే ముందు దాని విలువ 19 వేల డాలర్లు దాటింది.
బిట్ కాయిన్ను చెల్లింపుల పద్ధతిగా ఉపయోగించడం గురించి అక్టోబర్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ ఆండ్రూ బెయిలీ కూడా హెచ్చరించారు.
"నేను నిజాయితీగా చెప్పాలి. మనం చెప్పుకుంటున్న అంతర్గత విలువ అనేది, బిట్ కాయిన్లో ఉందని చూడడం కష్టం. జనం కోరుకుంటున్నారు కాబట్టి దీనికి బాహ్య విలువ ఉండవచ్చు" అన్నారు.
"చెల్లింపులకు బిట్ కాయిన్ ఉపయోగించడం చూసి చాలా భయమేస్తోంది. పెట్టుబడిదారులు దీని ధర అత్యంత అస్థిరంగా ఉంటుందనేది తెలుసుకోవాలి" అని బెయిలీ సూచించారు.
భారత ప్రభుత్వం దీన్ని గుర్తించిందా?
క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ నగదు. ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంకుల నియంత్రణలో ఇవి ఉండవు. రూపాయి, డాలర్ లాగా కాకపోయినా, ఆన్లైన్లో కొనుగోళ్లకు, చెల్లింపులకు వీటిని ఉపయోగించవచ్చు.
ఆసియాలో చైనా తర్వాత భారత్లోనే అత్యధికంగా బిట్ కాయిన్ల్లో పెట్టుబడులు ఉన్నాయని పాక్స్పుల్ అనే క్రిప్టో కరెన్సీ ఎక్చేంజీ తెలిపింది. అంతర్జాతీయంగా బిట్ కాయిన్ పెట్టుబడుల్లో అమెరికా తొలి స్థానంలో ఉందని... నైజీరియా, చైనా, కెనడా, బ్రిటన్ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వెల్లడించింది.
గత మార్చి 1 వరకూ భారత్లోని నాలుగు ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎక్చేంజీల్లో 4.5 మిలియన్ డాలర్ల మేర ట్రేడింగ్ జరగ్గా, డిసెంబర్ 16 వరకు ఇది 22.4 మిలియన్ డాలర్లకు పెరిగిందని కాయిన్గెకో అనే మేధో సంస్థ తెలిపింది. మార్చి తర్వాత ఈ ఎక్చేంజీల్లో ట్రేడింగ్ దాదాపు 500 శాతం పెరిగిందని పేర్కొంది.
''భవిష్యతులో డబ్బుకు బిట్ కాయిన్ కేంద్రం కాబోతుంది. భారత ప్రభుత్వం ఈ కరెన్సీని గుర్తించి, ఇది చట్ట విరుద్ధం కాదన్నది స్పష్టం చేయాలి. దీనిపై స్పష్టమైన పన్ను విధానం తేవాలి. వివిధ దేశాలు క్రిప్టో కరెన్సీల గురించి నిబంధనలు తెస్తున్నాయి. భారత్ కూడా వాటిని తమకు అనుగుణంగా మార్చుకుని అమల్లోకి తీసుకురావొచ్చు. ఇందుకోసం ఈ రంగంలో ఉన్నవారితో చర్చలు జరపాలి. ఆర్థిక సాంకేతిక రంగాల్లో మనం అగ్రగామిగా ఉన్నాం. ఈ పరిస్థితిని వాడుకుని మార్పుకు నేతృత్వం వహించాలి'' అని బిట్ కాయిన్ పెట్టుబడిదారుడు సందీప్ గోయెంకా అన్నారు.
పూర్తిగా ఆన్లైన్ కరెన్సీ కావడంతో సైబర్ నేరగాళ్లు క్రిప్టో కరెన్సీని దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కారణంతోనే 2018లో ఆర్బీఐ క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించింది. అయితే, సుప్రీం కోర్టు ఈ నిషేధాన్ని ఈ ఏడాది ఎత్తేసింది.
''అన్ని రంగాల్లో ఉన్నట్లే క్రిప్టో కరెన్సీని దుర్వినియోగం చేసేవాళ్లు కూడా ఉంటారు. అలా అని దీన్ని మనం అడ్డుకోకూడదు. బంగారం లాగే బిట్ కాయిన్లు కూడా ప్రత్యేకమైన, అరుదైన, విలువైన వస్తువులే'' అని గోయెంకా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- 'కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- బాయ్ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- 'మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: 'మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- 'మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- అనిల్కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్దేవ్ 'కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)