అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్లకు బీజేపీ మద్దతు - ట్రంప్ ఆగ్రహం- తటస్ధమని ప్రకటన...
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. భారతీయుల మద్దతు కోసం ట్రంప్, బిడెన్ వర్గాలు హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో ఆఫ్ బీజేపీ పేరుతో బీజేపీ అమెరికా ప్రవాస విభాగం నేతలు మొదట్లో డెమోక్రాటిక్ అధ్యక్ష రేసులో నిలిచిన భారతీయ మహిళ తులసీ గబ్బార్డ్కు మద్దతుగా చేసిన హంగామాపై న్యాయ విభాగం దర్యాప్తు చేస్తుండటంతో ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకుండా ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రచారం చేసుకోవడం కానీ ఓటు వేసుకోవడం కానీ చేయాలని బీజేపీ తమ నేతలకు సూచించింది.
అమెరికా ఎన్నికల రాజకీయం..
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందులో భారతీయుల పాత్ర తప్పనిసరి. కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో భారతీయుల ఓట్లు ఎవరికి లభిస్తే వారి అధ్యక్ష అవకాశాలు అంతగా మెరుగుపడతాయని భావిస్తుంటారు. ఈసారి కూడా ఆయా రాష్ట్రాల్లో భారతీయుల ఓట్లు సంపాదించేందుకు అధ్యక్ష అభ్యర్ధులు ట్రంప్, బిడెన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారతీయులతో తనకు ఎంతో అనుబంధం ఉందని నిరూపించుకోవడం కోసం ట్రంప్.. గతంలో మోడీ నిర్వహించిన నమస్తే ట్రంప్, హౌడీమోడీ కార్యక్రమాల వీడియోలను ప్రచారంలో తెగ వాడేసుకుంటున్నారు. అయితే అదే సమయంలో డెమెక్రాట్లకు బీజేపీ మద్దతునిస్తోందన్న వార్తలు ట్రంప్కు చికాకు పుట్టిస్తున్నాయి. దీంతో ఆయన బీజేపీ అమెరికా విభాగం ఆఫ్ బీజేపీ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందులో గతంలో డెమెక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్ధిగా నిలిచిన భారతీయ మహిళ తులసీ గబ్బార్డ్ కు మద్దతుగా ఆఫ్ బీజేపీ చేసిన హంగామా బయటపడింది.
ఆఫ్ బీజేపీ పై ట్రంప్ గుర్రు...
బీజేపీ అమెరికా విభాగం ఆఫ్ బీజేపీ పేరుతో కొన్నేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గతంలో వివిధ పార్టీలకు మద్దతుగా ఆఫ్బీజేపీ పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా డెమెక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్ధిగా నిలిచిన భారతీయ మహిళ తులసీ గబ్బార్డ్ కు మద్దతుగా ఆఫ్ బీజేపీ పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఈ వ్యవహారం ట్రంప్ దృష్టికి వెళ్లడంతో ఆఫ్ బీజేపీపై న్యాయవిభాగం దర్యాప్తుకు ఆదేశించారు. దీంతో బీజేపీ ఇరుకునపడింది. ట్రంప్ ఆగ్రహంతో ఆఫ్ బీజేపీ కేవలం బీజేపీ ప్రవాస భారతీయ విభాగం మాత్రమేనని, అది ఎవరికీ మద్దతుగా పనిచేయడం లేదని నిరూపించుకునే ప్రయత్నాల్లో పడింది. న్యాయశాఖ దర్యాప్తు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆఫ్ బీజేపీ నేతలకు భారత్ నుంచి ఆదేశాలు వెళ్లాయి.
బీజేపీ లోగో వాడొద్దంటూ...
అమెరికా న్యాయవిభాగం దర్యాప్తు నేపథ్యంలో ఆప్ బీజేపీ పేరుతో కానీ బీజేపీ లోగోతో కానీ ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అభ్యర్ధులకు మద్దతివ్వడం కానీ చేయొద్దని ప్రవాస బీజేపీ నేతలకు ఆ పార్టీ విదేశీ వ్యవహారాల విభాగం ఇన్ఛార్జ్గా ఉన్న విజయ్ చౌతాయ్వాలే విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని బీజేపీ నేతలు అధ్యక్ష ఎన్నికల్లో వ్యక్తిగతంగా ఏ పార్టీకైనా, అభ్యర్ధికైనా మద్దతు ఇచ్చుకోవచ్చని ఆయన ఓ ప్రకటనలో సూచించారు. అంతే తప్ప బీజేపీ లోగో వాడటాన్ని మాత్రం ఎట్టి పరిస్ధితుల్లో అంగీకరించబోమని తెలిపారు. భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని, అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న ఇద్దరి మద్దతూ భారత్కు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా లేమనే సంకేతాలను ఇచ్చేందుకు ఆఫ్ బీజేపీ ప్రయత్నిస్తోంది.
Recommended Video
ఆఫ్ బీజేపీ నాయకత్వ మార్పు...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాట్లకు మద్దతిస్తున్నామన్న ఆరోపణలపై న్యాయవిభాగం దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఆఫ్ బీజేపీ-యూఎస్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడిగా ఉన్న కృష్ణారెడ్డిని సైతం ఆ పదవి నుంచి తప్పించింది. ఆయన వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఆయన స్ధానంలో అడపా వీ ప్రసాద్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. ఆప్ బీజేపీ-యూఎస్ఏ సంస్ద పూర్తిస్ధాయిలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, దీనిపై ఎలాంటి దర్యాప్తుల ప్రభావం లేదని తెలిపింది. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత్ మద్దతు తమకే ఉందని చెప్పుకుంటున్న నేపథ్యంలో భారత్లో అధికార పార్టీగా ఉన్న బీజేపీ అమెరికా విభాగం డెమోక్రాట్లకు మద్దతు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే ట్రంప్ ఆఫ్ బీజేపీపై విచారణ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.