ఎన్నికల వేళ.. నల్లజాతీయుడిపై పేలిన తూటాలు: అట్టుడుకుతోన్న అమెరికా: ఆ స్టేట్లో ఎమర్జెన్సీ
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి కోసం జోరుగా కన్వెన్షన్లు కొనసాగుతోన్న వేళ.. అమెరికాలోని విస్కాన్సిన్లో అల్లర్లు చెలరేగాయి. పోలీసులు నల్లజాతీయుడిపై కాల్పులు జరపడంతో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా రెండో రోజు కూడా విస్కాన్సిస్లోని కొనేషా అట్టుడుకుతోంది. దీనితో విస్కాన్సిన్ మొత్తం అత్యవసర పరిస్థితులను విధించారు. ఈ మేరకు గవర్నర్ టోనీ ఎవర్స్ ఆదేశాలను జారీ చేశారు. కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చారు.
జాకబ్ బ్లేక్ అనే నల్లజాతీయుడిపై పోలీసులు అతి దగ్గరగా వెనుక వైపు నుంచి కాల్పులు జరిపారు. కెనోషా టౌన్లో జాకబ్ బ్లేక్ తన కారు ఎక్కుతున్న సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆ సమయంలో జాకబ్ బ్లేక్ ముగ్గురు కుమారులు కారులోనే ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. జాకబ్ బ్లేక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కెనోషాలో చోటు చేసుకున్న ఓ గొడవ ఈ కాల్పులకు దారి తీసినట్లు చెబుతున్నారు.
జాకబ్ బ్లేక్పై పోలీసులు కాల్పులు జరిపిన విషయం దావానలంలా పాకింది. నల్లజాతీయులు భగ్గుమన్నారు. ఆందోళనలను చేపట్టారు. నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై దాడులకు పాల్పడ్డారు. పలు పోలీసు వాహనాలను తగులబెట్టారు. ఈ ఘటనల్లో పలు వాహనాలు బుగ్గిపాలయ్యాయి. పరిస్థితి చేయి దాటుతుండటంతో కెనోషా టౌన్ సహా విస్కాన్సిన్ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ టోనీ ఆదేశాలను జారీ చేశారు.
అయినప్పటికీ.. ఆందోళనలు చల్లారట్లేదు. పెద్ద సంఖ్యలో గుమికూడిన నల్లజాతీయులు.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. కర్ఫ్యూ విధించినప్పటికీ లెక్క చేయలేదు. గుంపులు గుంపులుగా వీధుల్లో ప్రదర్శలకు దిగారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. జాకబ్ బ్లేక్పై కాల్పులు జరపడాన్ని టోనీ ఎవర్స్ తప్పుపట్టారు. నిరాయుధుడిపై కాల్పులు జరపడం సహేతుకం కాదని అన్నారు.
ఇంతకుముందు- మిన్నెసోటా స్టేట్లో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు పోలీసుల చేతుల్లో మరణించిన విషయం తెలిసిందే. మిన్నెసోటా పోలీసు ఒకరు జార్జ్ ఫ్లాయిడ్ మెడను మోకాలితో అదిమి పెట్టి.. చాలాసేపు కూర్చోవడంతో ఆయన మరణించారు. ఈ ఘటనతో అమెరికాలో కొన్ని రోజుల వరకూ ఆందోళనలు చెలరేగాయి. నిరసనలతో మిన్నెసోటా అట్టుడికిపోయింది. మిన్నెసోటాకు ఆనుకునే ఉన్న విస్కాన్సిన్లో కూడా తాజాగా నల్లజాతీయుడైన జాకబ్ బ్లేక్పై కాల్పులు జరపడం అత్యవసర పరిస్థితికి దారి తీసింది.