అమెరికాలో నల్లజాతీయుడి హత్య: అట్టుడుకుతున్న 25 నగరాలు, భారీగా విధ్వంసం
వాషింగ్టన్: ఇప్పటికే కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న అమెరికాను భారీ ఎత్తున కొనసాగుతున్న నిరసనలు, అల్లర్లు మరింత బీభత్స వాతావరణానికి కారణమవుతున్నాయి. జార్జ్ ఫ్లాడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ నల్లజాతీయుడి పట్ల మినియాపోలీస్ సిటీకి చెందిన ఓ పోలీసు అధికారి క్రూరంగా వ్యవహరించి అతడి మరణానికి కారణమైన విషయం తెలిసిందే.
ఈ ఘటనతో మినియాపోలీస్లో ప్రారంభమైన అల్లర్లు, నిరసనలు అమెరికాలోని పలు నగరాలకు వ్యాపించాయి. రాత్రిపూట విధించిన కర్ఫ్యూను కూడా ఉల్లంఘించి ఆందోళనకారులు హింసకు పాల్పడుతున్నారు. డెట్రాయిట్లో శనివారం నిరసనకారుల గుంపు మీద ఓ అజ్ఞాత వ్యక్తి జరిపిన కాల్పుల్లో 19ఏళ్ల యువకుడు మరణించాడు.
కాగా, హింసాత్మక ఘటనలతో పరిస్తితిని అదుపులోకి తెచ్చేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. మినియాపోలీస్కి నార్త్ కరోలినా, న్యూయార్క్ నుంచి సైనికులను తరలించారు.
మరోవైపు అమెరికాలోని న్యూయార్క్, బ్ల్రూక్లిన్, కంటకీ, టెక్సాస్, అంట్లాటా, జార్జియా, మిచిగాన్, పోర్ట్ ల్యాండ్ వంటి 25 నగరాల్లో ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు.
పలు చోట్ల షాపులు, భవనాలకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో వైట్ హౌస్ తాత్కాలిక లాక్ డౌన్ ప్రకటించింది. ఫిలడెల్ఫియాలో శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళనలు ఆ తర్వాత విధ్వంసానికి, హింసాకు దారితీశాయి. ఆందోళనకారులు దాడుల్లో 13 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసు వాహనాలకు కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. కాగా, ఇప్పటి వరకు 1400 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.