ఇలా 2019లో మోదీ పక్కా: నల్ల కుబేరులకు చేదు గుళిక
2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికితీసి వెనుకకు రప్పిస్తానని నాడు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ఇచ్చిన వాగ్దానం నిజం కాబోతున్నది. కొన్ని అంతర్జాతీయ చట్టాల నిబంధనలు ఇబ్బందికరం కావచ్చు.
తమను గెలిపిస్తే నల్లధనాన్ని వెలికి తీస్తానని ఇచ్చిన హామీకి అనుగుణంగానే మోదీ ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తున్న అవిరళ క్రుషికి కీలకమైన నిర్ణయం వెలువడింది. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించిన నల్ల కుబేరులకు స్వర్గధామంగా పరిణమించే స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో వారు దాచుకున్న ధనం వివరాలు, ఖాతాల సమాచారం భారతదేశానికి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తంచేస్తూ నిర్ణయం తీసుకున్నది.
మోదీ సర్కార్ ముందడుగు ఇలా
దీంతో స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం సమాచారాన్ని వెలికి తీసే దిశగా నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసినట్లే. అంతా అంచనాల ప్రకారం జరిగితే 2019 సెప్టెంబర్ నాటికి స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న భారతీయ కుబేరుల జాబితా కేంద్ర ప్రభుత్వ చేతులకు అందనున్నది.
40 దేశాలకు నల్ల కుబేరుల జాబితా ఇచ్చేందుకు రెడీ
ఈ మేరకు భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్య దేశాలు సహా 40 దేశాలకు నల్ల కుబేరుల సమాచారం ఇచ్చేందుకు స్విట్జర్లాండ్ అంగీకారం తెలిపింది. కాకపోతే అత్యంత కీలకమైన ఈ సమాచారం గోప్యంగా ఉంచడంతోపాటు భద్రత కల్పించాలన్న నిబంధనకు కట్టుబడి ఉండాలని కోరింది. జీ - 20, ఆర్థికాభివ్రుద్ధి, సహాకార సంస్థ (ఒఇసిడీ) తదితర అంతర్జాతీయ సంస్థలు రూపొందించిన మార్గదర్శకాల వెలుగులో స్విట్జర్లాండ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
భారత్తో చర్చల తర్వాత ఎఇఒఐకి స్విస్ ఓకే
భారతదేశంతో ఎడతెగని సంప్రదింపులు జరిపిన తర్వాత శుక్రవారం సమావేశమైన స్విట్జర్లాండ్ సమాఖ్య మండలి.. భారత్ సహా ఇతర దేశాల ప్రభుత్వాలతో 'నల్ల కుబేరుల సమాచార మార్పిడి కోసం 'స్వతస్సిద్ధ సమాచార మార్పిడి (ఎఇఒఐ)' విధానం అమలుకు రూపొందించిన ముసాయిదాను ఆమోదించింది. 2019లో సమాచార మార్పిడికి ముందు వాస్తవ పరిస్థితిపై నివేదిక రూపొందిస్తామని ఈ మండలి తెలిపింది.
ఎఇఒఐపై భారత్ నోటిఫికేషన్తో ఇలా ప్రక్రియ ప్రారంభం
'ఎఇఒఐ' ముసాయిదాను భారత్ కూడా ఆమోదించి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత నల్ల కుబేరుల జాబితా అందజేసేందుకు ఖచ్చితమైన తేదీ ఖరారు కానున్నది. అయితే మల్టీ లాటరల్ కాంపిటెంట్ అథారిటి అగ్రిమెంట్ (ఎంసిఎఎ)లోని ఏడో సెక్షన్ ప్రకారం ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసిన తర్వాతే 'ఎఇఒఐ' ప్రకారం సమాచార మార్పిడికి అవసరమైన నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎఇఒఐ అమలు కోసం 2016 నవంబర్ లో రెండు దేశాలు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి.
వ్యక్తుల గోప్యతపై భారత్ ఇలా ఐటీ చట్టం రూపకల్పన
అంతకుముందు 2012 జనవరిలో 'పన్ను చెల్లింపులపై పరస్పర కార్య నిర్వాహక సహకార సదస్సు' ఒప్పందంపైనా భారత్ సంతకంచేసింది. ఇది పన్ను చెల్లింపుదారుల హక్కులను గౌరవిస్తూ వివిధ అంశాలు, రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించేందుకు రూపుదిద్దుకున్న బహుముఖ ఒప్పందం. సభ్య దేశాలు సమాచారానికి భద్రత కల్పించడంతోపాటు రహస్యంగా ఉంచడంపైనే స్విస్ నుంచి సమాచార మార్పిడి ఆధార పడి ఉంటుంది.
వ్యక్తిగత సమాచార గోప్యత కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సహా భారత్ రూపొందించిన పలు చట్టాల పట్ల స్విట్జర్లాండ్ సంత్రుప్తి వ్యక్తం చేసింది. ఇరు దేశాలు ఒప్పందం అమలుకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత సమాచార మార్పిడి ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభమైతే 2019 సెప్టెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వస్తుంది.